జగన్ పార్టీకి 'ఆర్థిక' కష్టాలు: టార్గెట్ కోటీశ్వరులు?

లోకసభకు నామినేషన్ వేసే సమయంలో కూడా జగన్ తన ఆస్తులు వందల కోట్లులో చూపారు. అయితే ఇంత ఆస్తి కలిగి ఉన్న జగన్ పార్టీ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో పడిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జగన్ ఆస్తుల కేసును సిబిఐ విచారిస్తోంది. ఈ కేసుకు సంబంధించి జగన్ కంపెనీలకు చెందిన పలు అకౌంట్లను సిబిఐ ఫ్రీజ్ చేసింది. అయితే హైకోర్టు ఆ తర్వాత కొంత ఉపశమనం కలిగించింది. అలాగే తాజాగా ఈడి కూడా జగన్ కేసులో ఆస్తులను జప్తు చేసింది.
జగన్కు చెందిన అకౌంట్లలోకి ఎక్కడి నుండి డబ్బులు వచ్చాయి, ఎలా వచ్చాయి తదితర అంశాలను సిబిఐ దర్యాఫ్తు చేస్తోంది. సిబిఐ జగన్ కంపెనీల అకౌంట్లపై ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో పార్టీ పరంగా ఖర్చు పెట్టడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయట. జగన్ పార్టీ ఇప్పుడు ఆయా జిల్లాల్లోని కోటీశ్వరులైన నేతలను టార్గెట్గా చేసుకుందని అంటున్నారు. జగన్ వద్ద డబ్బు చాలా ఉన్నప్పటికీ ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉందని అంటున్నారు.
దీంతో ప్రతి జిల్లాల్లో బాగా డబ్బున్న ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తున్నారట. ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకొని పలువురు నేతలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీదే 2014లో అధికారం అని భావిస్తున్నారు. దీనిని ఉపయోగించుకొని జగన్ పార్టీ ఆయా జిల్లాల్లో డబ్బున్న ఇతర పార్టీ నేతలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు, పదవులు ఇస్తామని చెప్పి పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు చేస్తోందని చెబుతున్నారు. వారిని పార్టీలో చేర్చుకొని ఎవరి జిల్లా బాధ్యతలను వారికి అప్పగించేస్తారట. మరి ఇది ఎంత వరకు నిజమో, ఎంత వరకు సఫలమవుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications