మాటపై నిలిపేందుకు కెసిఆర్ తంటాలు?
దాంతో అందుకు పార్టీ శాసనసభ్యులను ఒప్పించేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. తన నుంచి శాసనసభ్యులు జారిపోకుండా ఆయన తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. అందుకుగాను ఈ నెల 25వ తేదీ నుంచి అందుబాటులో ఉండాలని ఆయన శాసనసభ్యులకు సూచించారు. తెలంగాణపైనే కాకుండా పార్టీ విలీనంపై కెసిఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని శాసనసభ్యులతో అనిపించడానికి కెసిఆర్ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు.
శాసనసభ్యులందరితో ఆ మాట అనిపించడానికి వీలుగా శుక్రవారం ఓ సమావేశం ఏర్పాటు చేశారు. నిజాం క్లబ్లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నారు. అయితే, ఈ విషయం బయటకు పొక్కడంతో దాన్ని మరో చోటికి మార్చినట్లు కూడా వార్తలు వచ్చాయి. హైదరాబాదు శివారులో ఎక్కడో సమావేశమయ్యారంటూ శుక్రవారం వార్తలు వచ్చాయి. కానీ ఆ సమావేశం రద్దయినట్లు శనివారం వార్తలు వచ్చాయి.
తెరాసకు 18 శాసనసభ్యులున్నారు. వీరంతా కెసిఆర్ మాట నిలబడితేనే పరిణామాలు సజావుగా ముందుకు సాగుతాయని అంటున్నారు. ఎవరైనా తిరుగుబాటు ప్రకటిస్తే సమస్య తలెత్తవచ్చునని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప మరోటి తనకు అవసరం లేదని, పార్టీని కూడా త్యాగం చేస్తానని కెసిఆర్ అంటున్నట్లు చెబుతున్నారు. నిజానికి, తెలంగాణకు అనుకూలంగా కేంద్రం ప్రకటన చేస్తుందని ఇప్పటికి కూడా ఎవరూ విశ్వసించడం లేదు. ఏమో, ఏమవుతుందో చూడాలి.