ఏం అడుగుతారో: కిరణ్కు మంత్రుల భయం
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు హయాంలో నెలకు రెండుసార్లు జరిగేవి. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో కేవలం 2008లోనే 20 సమావేశాలు జరగ్గా 2009లో ఆయన ఆగస్టు వరకు 13సార్లు మంత్రివర్గ భేటీలు జరిగాయి. రోశయ్య 14 నెలలపాటు ఉన్న కాలంలో 28సార్లు భేటీలు నిర్వహించారు. అయితే కిరణ్ ఇప్పటికి 21 నెలల పదవీ కాలాన్ని పూర్తి చేసినా 13 సార్లే నిర్వహించారు. మంత్రులతో సఖ్యత లేకపోవడం, సమావేశాన్ని నిర్వహిస్తే ఎవరు, ఎందుకు ఎదురుదాడి చేస్తారో అంతుబట్టకపోవడంతో మంత్రివర్గ భేటీ అంటేనే ఆయన ఆమడ దూరం వెళుతున్నారు.
రెండుమూడు నెలలకోసారి ఓ భేటీ నిర్వహిస్తున్నారు. కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భంలో తనకు తానుగా, లేదా తనకు అనుకూలంగా ఉంటారనుకున్న మంత్రులు అందుబాటులో ఉన్నపుడు పిలిపించి మాట్లాడి పని కానిచ్చేస్తున్నారు. కిరణ్ 2010 నవంబర్ 24న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే ఏడాది డిసెంబర్ 2న ఒకసారి, 30న మరోసారి మంత్రివర్గాన్ని సమావేశ పరిచారు. దీంతో... పాత సంప్రదాయం ప్రకారం ప్రతినెలా రెండుసార్లు కేబినెట్ భేటీ ఉంటుందని అంతా భావించారు.
డిసెంబర్ తర్వాత కిరణ్ 2011 ఫిబ్రవరి 14, 23వ తేదీల్లో మంత్రివర్గ సమావేశం జరిపారు. మార్చిలో కేబినెట్ భేటీకి విరామం ఇచ్చారు. ఆ తర్వాత ఏప్రిల్ 16, మే 24, జూన్ 16న ఇలా నెలకోసారి కేబినెట్ భేటీ జరిగింది. జూలైలో మళ్లీ జరగలేదు. ఆ తర్వాత ఆగస్టు 16న మంత్రివర్గం సమావేశమైంది. ఈసారి సుదీర్ఘ విరామం తర్వాత అక్టోబర్ 29న భేటీ నిర్వహించారు. నవంబర్ 30న సమావేశపరచి .. డిసెంబర్లో సెలవు ఇచ్చారు.
ఈ ఏడాదిలో ఎనిమిది నెలలు పూర్తికాగా... కేవలం నాలుగుసార్లు మాత్రమే మంత్రివర్గ భేటీ జరిగింది. గత రెండు నెలలుగా మంత్రివర్గ సమావేశం జరగలేదు. శుక్రవారం నాడు మంత్రివర్గ సమావేశం జరుగనుంది. కాగా ఇది వరకటి సమావేశాల్లో చురుగ్గా వ్యవహరించే మోపిదేవి వెంకట రమణారావు జైలులో ఉండగా.. మరో మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామా చేసి మంత్రివర్గ సమావేశానికి రానని స్పష్టంగా చెప్పారు.