కృష్ణ భగవానుడి అవతారంలో కిరణ్ రెడ్డి
కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన దగ్గర్నుంచి ఆటుపోట్లను ఎదుర్కున్నారు. అయినా రెండేళ్లు ముఖ్యమంత్రిగా సాగారు. ఇంకా సాగుతూనే ఉన్నారు. మధ్యమధ్యలో తెలంగాణ ఉద్యమాలు, శాసనసభ్యుల వలసలు... ఇలా అనేక ఇబ్బందులను ఆయన ఎదుర్కున్నారు, ఎదుర్కుంటున్నారు. ప్రత్యర్థులు ఆయన చేత ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించాలని కూడా ప్రయత్నిస్తున్నారు.
అత్యంత క్లిష్టమైన స్థితిలో కూడా ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి రెండేళ్లు పూర్తి చేశారు. ఈ సందర్భంలో హైదరాబాద్ నగర కాంగ్రెస్ కమిటీ శంఖు, చక్రంతో శ్రీకృష్ణుని రూపంలో కిరణ్ కుమార్ రెడ్డి కటౌట్ పెట్టింది. అది ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
రెండేళ్లు ముఖ్యమంత్రిగా తన పదవీ బాధ్యతలు పూర్తి చేసుకున్న కిరణ్ కుమార్ రెడ్డి ఓ టీవీ చానెల్కు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. బ్రహ్మానంద రెడ్డి కన్నా తాను ఎక్కువ కష్టాలు ఎదుర్కున్నానని చెప్పారు. కాంగ్రెసు నాయకులు ఒక్కటైతే ప్రతిపక్షాలు ఉండవని అన్నారు. అయన మరో ఏడాది పూర్తి చేసుకోవాలనే ఆలోచనలోనే ఉన్నట్లు అనిపిస్తున్నారు.