బాబుపై మోత్కుపల్లి అలక: ఫోన్ చేసినా నో
బాబు వైఖరితో మనస్థాపానికి గురైన మోత్కుపల్లి రెండు రోజులుగా ఇంటి పట్టునే ఉండిపోయారట. మోత్కుపల్లితో మాట్లాడటానికి చంద్రబాబు ఫోన్లో ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదట. తెలంగాణ అంశంపై తుది నిర్ణయం తీసుకోవడానికి మూడు రోజుల క్రితం నిర్వహించిన పొలిట్బ్యూరో సమావేశానికి తనను పిలవకపోవడం మోత్కుపల్లిని మనస్థాపానికి గురి చేసిందని సమాచారం.
తెరాసకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడటానికి పార్టీలోని నాయకులు ఇష్టపడని రోజుల్లో తాను ఒంటరి పోరాటం చేశానని, ఇంత చేస్తే తెలంగాణ అంశంలో నిర్వహించిన పొలిట్బ్యూరో సమావేశానికి తనను పిలవకపోవడం ఏమిటని, ప్రత్యేకంగా ఈ అంశంపైనే పొలిట్బ్యూరో సమావేశం నిర్వహించినప్పుడు దానికి తనని పిలవకుంటే ఎలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మోత్కుపల్లి ప్రస్తుతం పార్టీ శాసనసభాపక్షానికి ఉప నేతగా ఉన్నా, పొలిట్బ్యూరోలో సభ్యుడుగా లేరు.
అయితే సందర్భాన్ని బట్టి ఇతర నేతలను పొలిట్బ్యూరో సమావేశాలకు పిలుస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇంత ముఖ్యమైన సమావేశానికి తనను పిలవకపోవడం ఆయనను కలచి వేసిందట. పొలిట్బ్యూరో సమావేశానికి ముందు రోజు తెలంగాణ ప్రాంత నేతలతో చంద్రబాబు నిర్వహించిని భేటీకి మోత్కుపల్లి హాజరై తన అభిప్రాయాలు చెప్పారు. తర్వాత రోజు పొలిట్బ్యూరో భేటీకి మాత్రం ఆయనను పిలవలేదు.