గవర్నర్ చిటపటలు: బతికే ఉన్నానని చెప్పండి
తెలుగుదేశం వర్గాల సమాచారం ప్రకారం - ఆ పార్టీ ఎమ్మెల్యేల ప్రతినిధి బృందం ఆయన వద్దకు వెళ్లగానే మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు గవర్నర్ను మర్యాదపూర్వకంగా పలకరించారు. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి పోలీసు క్రీడల ముగింపు కార్యక్రమంలో నరసింహన్ కాలుజారి కింద పడిన నేపథ్యంలో ఈ విషయాన్ని తాము టీవీల్లో చూశామని, ఇప్పుడెలా ఉందని అశోక్ గజపతిరాజు ఆయన్ను పరామర్శించారు.
దీనికి గవర్నర్ - "నేను పడిపోయింది కూడా చూపించారా'' అని అడిగారు. చూపించారని తెలుగుదేశం ఎమ్మెల్యేలు చెప్పగానే.. "మీడియా వాళ్లకు పనిలేదు. చిన్న చిన్నవిషయాలను కూడా పెద్దవి చేసి చూపిస్తుంటారు.నన్ను చూశారు కదా! నేను శుభ్రంగా ఉన్నానని.. బతికే ఉన్నానని కూడా వారితో చెప్పండి'' అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఆయన మాటలకు తెలుగుదేశం ఎమ్మెల్యేలు నివ్వెరపోయారు.
"మీరు ఇంత కటువుగా మాట్లాడటం సరికాదు. ఏదో ప్రమాదం జరిగిందంటే ఎలా ఉందని మాత్రమే అడిగాం. మాకు వేరే ఉద్దేశాలేమీ లేవు'' అని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు అన్నారు. దీంతో గవర్నర్ ఆ విషయాన్ని మరి పొడిగించలేదు. అనంతరం.. రాష్ట్రంలో అనేక సమస్యలు తీవ్ర రూపం దాల్చాయని, వాటిపై చర్చకు అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయించాలని వారు ఆయనను కోరారు.
"అసెంబ్లీ దేనికి? మీరు చేసేది ధర్నాలే కదా'' అన్నారు. "ప్రభుత్వం ఇచ్చే సమాధానం సంతృప్తికరంగా లేనప్పుడు ప్రజాస్వామ్య పద్ధతుల్లో మేం వాకౌట్ చేసి నిరసన తెలుపుతాం. ఇది ప్రజాస్వామ్య సంప్రదాయం.' అని రావుల అన్నారు.