కెసిఆర్కు మేనల్లుడు ఉమేష్ తలనొప్పి
తెరాసకు చెందిన తెలంగాణ భవన్లో పార్టీ కార్యకలాపాలు కాకుండా వాణిజ్యపరమయిన కార్యకలాపాలు ఎక్కువయిపోయాయంటూ కోర్టుకు విన్నవించుకున్నారు. గత ఏప్రిల్ నెలలో ఉమేష్ దీనిపై కోర్టులో ఫిర్యాదు చేశారు. బుధవారంనాడు కోర్టు ఉమేష్ పిటీషన్ను పరిశీలించింది. అనంతరం తెరాస కార్యాలయంలో ఉల్లంఘనలు జరిగినట్లు ఉమేష్ సమర్పించిన ఆధారాలను పరిశీలించి మరింత క్షుణ్ణంగా దర్యాప్తు చేయించి నివేదిక అందించాలని ఆదేశించింది.
తెరాస పార్టీ కార్యాలయంకోసం గతంలో ప్రభుత్వం 4,080 గజాల స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలంలో భవనాన్ని నిర్మించిన తెరాస పార్టీ కార్యకలాపాల మాట అటుంచి ఓ న్యూస్ ఛానల్ ఏర్పాటు చేయడమే కాకుండా రియల్ ఎస్టేట్ బ్రోకర్లంతా అక్కడ తిష్ట వేసి కార్యకలాపాలు నడుపుతున్నారన్నది ఉమేష్ ఫిర్యాదు. పార్టీ కార్యకలాపాలకు ఉపయోగించుకోమని ప్రభుత్వం భూమి ఇస్తే, దాన్ని వ్యాపార అవసరాలకు వినియోగించడం నిబంధనల ఉల్లంఘన కాదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రెండు అంతస్తులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని చెపుతున్నారాయన.
ఒక పార్టీకి అధ్యక్షుడుగా ఉన్న కేసీఆర్ ఇలాంటి చర్యలకు పాల్పడితే ఇక సామాన్య ప్రజల మాటేంటి అంటూ ప్రశ్నించారు. మరోవైపు ఉమేష్ రావుకు తెరాసతో ఉన్న విభేదాల వల్లనే కోర్టుకు ఎక్కారని తెరాస నాయకులు అంటున్నారు.