వైయస్ జగన్కు పురంధేశ్వరి సాఫ్ట్ కౌంటర్

వైయస్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలన్నీ కాంగ్రెసు పార్టీకి చెందినవేనని ఆమె నర్మగర్భంగా చెప్పారు. ఆ పథకాల అమలుకు ప్రభుత నిధులే ఖర్చు చేశారని, అందువల్ల ఆ పథకాలన్నీ ప్రభుత్వానివేనని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన పథకాలు కాంగ్రెసు పార్టీవి కావని, వాటి ప్రతిష్ట వ్యక్తిగతంగా వైయస్ రాజశేఖర రెడ్డికి దక్కుతుందని జగన్ వాదిస్తూ వస్తున్నారు. నిజానికి, జగన్ రాజకీయాలకు అదే మూలసూత్రం కూడా.
వైయస్ హయాంలో అమలైన పథకాలకు వనరులు కాంగ్రెసు ప్రభుత్వమే సమకూర్చిందని, వ్యక్తులు సమకూర్చలేదని ఆమె అన్నారు. అంటే, వైయస్కు కాకుండా ఆ ఖ్యాతికి కాంగ్రెసుకు దక్కుతుందనేది ఆమె ఆంతర్యం. వైయస్ రాజశేఖర రెడ్డి పేరును కాంగ్రెసు ఉప ఎన్నికల్లో వాడుకోవాలా, వద్దా అనే వివాదం చెలరేగుతున్న సమయంలో ఆమె ఆ విధంగా మాట్లాడారు.
ఉప ఎన్నికల్లో తమ పార్టీ చేసిన మంచి పనులు చెప్పుకుంటే చాలునని, 2004 నుంచి ఇప్పటి వరకు తమ పార్టీ ఎన్నో మంచి పథకాలు ప్రవేశపెట్టిందని, వాటిని సమర్థంగా అమలు చేస్తోందని, ఈ విషయాన్ని తాము చెప్పుకుంటే చాలునని ఆమె అన్నారు. 2004లో ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన వైయస్ రాజశేఖర రెడ్డి మరణించే వరకు కొనసాగారు. పురంధేశ్వరి మాటలను బట్టి వైయస్ హయాంలో అమలైన పథకాలన్నీ కాంగ్రెసువేనని, వైయస్ వ్యక్తిగతమైనవి కావని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications