వైయస్సార్ టార్గెట్: సాయిప్రతాప్ మొరాయింపు
కాంగ్రెసు నాయకులు తప్పనిసరిగా వైయస్ను విమర్శించాలని అధిష్టానం ఆదేశాలు జారీ చేస్తే తనకు ఆ రాజకీయాలు అవసరం లేదని ఆయన అన్నారు. పార్లమెంటు సభ్యత్వాన్ని వదులుకోవడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. అవినీతికి జగన్ ఒక్కడినే దోషిగా చూపిస్తే సరిపోదని, వైయస్ రాజశేఖర రెడ్డిని కూడా బాధ్యుడ్ని చేస్తూ మూకుమ్మడిగా విమర్శల జడివాన కురింపచాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ నిర్వహించిన సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
కడప జిల్లావాసిగా, వైయస్ మిత్రునిగా చెబుతున్నానని, వైయస్తో తనకు 46 ఏళ్ల స్నేహం ఉందని, వైయస్ ప్రాణస్నేహితుడిగా ముద్ర వేయించుకున్నవాడినని, తాను వైయస్సార్ను విమర్శించలేనని, అందుకు తన మనసు అంగీకరించదని ఆయన అన్నారు. వైయస్ను విమర్శించాల్సి వస్తే తాను ప్రచారానికి కూడా వెళ్లబోనని ఆయన అన్నారు.
వైయస్ మరణించినప్పుడు ఇటువంటి మహా నేతను కోల్పోవడం తీవ్ర నష్టమని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అన్నారని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ను ఆదర్శంగా తీసుకోవాలని ప్రధాని ముఖ్యమంత్రుల సమావేశంలో ఓసారి అన్నారని ఆయన గుర్తు చేశారు. ఇటీవలి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కూడా రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ను ఆదర్శంగా చూపించారని ఆయన అన్నారు. అటువంటి స్థితిలో తాను వైయస్ను విమర్శించడానికి ముందుకు రాబోనని ఆయన తెగేసి చెప్పారు. మనసొక చోట, తనువొక చోట అన్నట్లు కాంగ్రెసులో కొనసాగుతున్న సాయిప్రతాప్ వైయస్ జగన్ వైపు వెళ్లడానికి సిద్ధపడుతున్నారని ఎవరైనా అనుకుంటే ఆ తప్పు వారిది కాకపోవచ్చు.