కిరణ్లో వణుకు: జగన్ అరెస్టైతే వరుస రాజీనామాలేనా!?
ఈ నేపథ్యంలో ఆయనను సిబిఐ ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా జరుగుతోంది. శుక్రవారం జగన్ విచారణకు హాజరు కాగానే అరెస్టు చేస్తారనే ప్రచారం జరిగింది. రెండోరోజు, మూడు రోజు కూడా జగన్ అరెస్టుహై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అంతేకాదు బెట్టింగులు కూడా జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ను అరెస్టు చేస్తే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి గట్టి షాక్ ఇవ్వాలని వైయస్సార్ కాంగ్రెస్ భావిస్తోందని అంటున్నారు.
అందుకే అధికార, ప్రతిపక్ష పార్టీలతో కలిపి మూకుమ్మడి రాజీనామాలకు తెర లేపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం కొందరు ఎమ్మెల్యేలతో జగన్ నేరుగా మంతనాలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల నుండి దాదాపు ముప్పై మంది ఎమ్మెల్యేలు జగన్ వైపు వస్తారనే ప్రచారం మూడు రోజులుగా జరుగుతోంది. రెండు రోజుల క్రితం ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, శనివారం బొబ్బిలి శాసనసభ్యుడు సుజయ్ కృష్ణ రంగారావు, ఆదివారం మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగి రెడ్డి జగన్ను కలిశారు.
మరికొందరితో పార్టీ నేతలు నిత్యం టచ్లో ఉన్నారని అంటున్నారు. జగన్ను అరెస్టు చేస్తే కనుక రాజీనామాలకు సిద్ధం కావాలని వారు సూచిస్తున్నారని అంటున్నారు. అయితే సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న జగన్ను అరెస్టు చేసిన పక్షంలో వారు రాజీనామాలకు సిద్ధపడతారా లేదా అనే అనుమానంలో ఆ పార్టీ నేతలు ఉన్నారని అంటున్నారు. అయితే ఆ దిశలో ఒప్పించేందుకు మాత్రం తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు.
ఎమ్మెల్యేలతో పాటు జాతీయ స్థాయిలో జగన్ శక్తిని తెలిపేందుకు ఇద్దరు ముగ్గురు పార్లమెంటు సభ్యులను కూడా తమ వైపుకు రప్పించుకునేందుక వైయస్సార్ కాంగ్రెసు ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు. ఎంపీలు తమ వైపు వస్తే జాతీయ స్థాయిలో ఫోకస్ అవుతామని వారు భావిస్తున్నారని అంటున్నారు. అయితే జగన్ చేస్తున్న ఆపరేషన్ ఆకర్ష్తో అధికార పక్షం ఆత్మరక్షణలో పడిందని అంటున్నారు.
జగన్ వైపు వెళ్లే వారిని కట్టడి చేసేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రంగంలోకి దిగారని అంటున్నారు. జగన్ ఆపరేషన్ ఆకర్ష్కు వికర్ష్ ప్రయోగిస్తున్నారని అంటున్నారు. అయితే ఆయన ప్రయత్నాలు సఫలం కావడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. తొలి రోజు ఆళ్ల నాని జగన్ను కలవగానే కిరణ్ రంగంలోకి దిగి మిగిలిన ఎమ్మెల్యేలపై అప్రమత్తం చేశారట. ఎవరెవరు జగన్ వైపు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారో వారి లిస్ట్ తెప్పించుకున్నారట.
శనివారం సుజయ్ కృష్ణ రంగారావు యువనేతతో భేటీ కాగానే మంత్రి కొండ్రు మురళిని రంగంలోకి దింపారు. కానీ అది ఫలించలేదని అంటున్నారు. వలసలు ఆపేందుకు కిరణ్తో పాటు ప్రదేశ్ కాంగ్రెసు కమిటి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట. ఆ పనిని మంత్రులకు అప్పగించారని అంటున్నారు. వలసలు ఆపకుంటే అసలుకే ఎసరు వస్తుందని కాంగ్రెస్ ఆందోళన చెందుతోంది.