కిరణ్ 'టి' లీక్: చిరును కాదని, జగన్ను ఎదుర్కొని
రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచి తెలంగాణకు లక్ష కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని, విభజిస్తే నక్సల్స్ సమస్య మళ్లీ ఊపందుకుంటుందని, నీటి తగాదాలు వస్తాయంటూ... ఐదారు రోజులుగా ప్రచారం సాగుతోంది. అదే సమయంలో కోర్ కమిటీలో తమ రోడ్ మ్యాప్ ఇచ్చిన ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహలు చెప్పిన అంశాలు అంతగా బయటకు రావడం లేదు.
బొత్స సమైక్యాంధ్రకు అనుకూలంగా రోడ్ మ్యాప్ ఇచ్చారని చెప్పినప్పటికీ కిరణ్ రిపోర్ట్ స్థాయిలో ప్రచారం జరగలేదు. ఐదారు రోజులుగా కిరణ్ సమైక్యాంధ్రకు అనుకూలంగా రోడ్ మ్యాప్ ఇచ్చారని, బలమైన వాదన వినిపంచారని రోజుకొకటి వస్తోంది. అయితే ఈ లీకులకు ఆయన వర్గమే కారణం కావొచ్చుననే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. దామోదర రిపోర్టు బయటకు రాకుండా కిరణ్ రిపోర్ట్ ఎలా లీకవుతోందని వి హనుమంత రావు మంగళవారం ప్రశ్నించారు. ఇదే అనుమాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు.
అయితే అధిష్టానం మనసులోని విషయం ఎరిగిన ముఖ్యమంత్రి ఉద్దేశ్యపూర్వకంగా తన వర్గంతో ఈ లీకులు ఇప్పిస్తున్నారా? అనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం దాదాపు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. జాతీయ మీడియాలో సైతం తెలంగాణకు అనుకూలంగానే ఉంటుందనే ప్రచారం సాగుతోంది. అయితే హైదరాబాదుతో పాటు పలు అంశాలపై చర్చిస్తున్నట్లుగా సమాచారం.
మొత్తానికి అధిష్టానం విభజనకే మొగ్గుచూపనుందని అంటున్నారు. దీనిని గుర్తించిన కిరణ్ వర్గం సీమాంధ్రలో ఆయనను హీరోగా చిత్రీకరించేందుకు ఈ లీకులు ఇస్తుండవచ్చునని అంటున్నారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తమకు స్టార్ బ్యాట్సుమన్ ఉన్నాడని, కిరణ్ను ఉద్దేశించి పరోక్షంగా అన్నారు. తెలంగాణపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియడం వల్లనే 2014 ఎన్నికల నాటికి తాను సీమాంధ్రలో హీరో కావాలనే ఉద్దేశ్యంతో ఇలా చేస్తుండవచ్చునని అంటున్నారు.
ప్రస్తుతం సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీకి చిరంజీవి మినహా అంత ఆకర్ష నేత లేరు. వ్రతం చెడ్డా ఫలితం దక్కాలన్నట్లుగా.. విభజన జరిగినా కాంగ్రెసు పార్టీ నుండి సీమాంధ్రలో తాను వచ్చే ఎన్నికల నాటికి మరోసారి 'ముఖ్య'నేతగా ఎదగాలనే ఉద్దేశ్యంతో కిరణ్ ఉన్నారంటున్నారు. కరడుగట్టిన సమైక్యవాదిగా ప్రజల్లో నిలిచి చిరు, బొత్సలను పక్కకు తోసిరాజని తాను ఎదగాలనుకుంటుంటుండవచ్చునని అంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు, జగన్లు తెలంగాణపై ఏం చెప్పలేకపోతున్నారు. మౌనం దాల్చుతున్న వారిని వచ్చే ఎన్నికల్లో తన సమైక్య గళం ద్వారా ధీటుగా ఎదుర్కోవచ్చునని కూడా కిరణ్ భావిస్తున్నారని అంటున్నారు.