నిన్న మోడీ, నేడు ఎన్డీయే: బాబు కదలిక క్లియర్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బిజెపివైపు కదులుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంతకు ముందు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రశంసలతో ముంచెత్తిన ఆయన ఇప్పుడు ఎన్డీయే పాలనపై మోజు ప్రదర్శించారు. ఎన్డీయె ప్రభుత్వం సాధించిన ఫలితాలను కాంగ్రెసు మట్టి పాలు చేసిందని ఆయన విరుచుకుపడ్డారు.
ఈ దేశానికి మొదటి విలన్ కాంగ్రెస్ అని అగ్రరాజ్యంగా ఎదుగుతుందనుకొన్న దేశాన్ని చివరకు పతనం అంచుల వరకూ తీసుకువెళ్లారని ఆయన దుయ్యబట్టారు. అవినీతితో సర్వం నాశనం చేశారని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని భూస్థాపితం చేయడమే మాకు ప్రధమ లక్ష్యమని ఆయన అన్నారు. ఎన్డీయే, తృతీయ ఫ్రంట్ వంటివి ఉన్నాయని, కాంగ్రెస్ను ఫినిష్ చేయడానికి ప్రత్యమ్నాయంగా ఎవరు ఎదుగుతున్నారో చూస్తున్నామని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
కాగా, ఎన్డీయే కూటమితో మళ్లీ జత కట్టడం, నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థిత్వం గురించి అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పలేదు. దేశం, రాష్ట్రం ప్రస్తుతం సంక్షోభంలో ఉన్నాయని, రాజకీయాల గురించి మాట్లాడటానికి ఇది సమయం కాదన్నారు. కాంగ్రెస్ దిక్కుమాలిన పాలన వల్ల మొత్తం దేశం ఇప్పుడు సంక్షోభంలో పడిందని ఆయన అన్నారు.
ఎన్డీయే హయాంలో చేసిన మంచి పనులతో వచ్చిన ఫలితాల వల్ల యూపీఏ మొదటి హయాంలో గట్టెక్కారని, రెండోసారి గెలిచిన తర్వాత అసమర్థ పాలన, అవినీతి కుంభకోణాలతో నాశనం చేశారని ఆయన అన్నారు. ఎన్డీయే హయాంలో సంస్కరణలు ఒక పద్ధతిగా సాగడంలో నా కృషి చాలా ఉంది. అదంతా మట్టిపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్నిబట్టి చంద్రబాబు స్పష్టంగా బిజెపి వైపు కదులుతున్నారనే సంకేతాలు అందుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.