దూతగా పరికర్: బిజెపితో కిరణ్ రెడ్డి అలయెన్స్?
హైదరాబాద్: ఓ జాతీయ పత్రిక ఆశ్చర్యకరమైన సంఘటనను వెలుగులోకి తెచ్చింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం ఉంది. బిజెపి నేత, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరికర్ ఆదివారంనాడు అత్యంత రహస్యంగా హైదరాబాద్ సాయంత్రం వచ్చేసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారట. కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడితే సీమాంధ్రలో బిజెపితో పొత్తు పెట్టుకునే అవకాశాలపై మనోహర్ పరికర్ కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది.
పరికర్ 24 గంటల పాటు హైదరాబాదులో ఉండి కిరణ్ కుమార్ రెడ్డినే కాకుండా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కూడా కలిశారట. కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు గురించి, పార్టీ పెడితే తమ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశాలపై పరికర్ కిరణ్ కుమార్ రెడ్డి వద్ద ఆరా తీసినట్లు ఆ పత్రిక రాసింది.

చంద్రబాబును మాత్రం ఆయన మర్యాదపూర్వకంగానే కలిశారట. ఇప్పటికే చంద్రబాబుకు, బిజెపి అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్కు మధ్య ఎన్నికల పొత్తుకు సంబంధించి ప్రాథమిక అవగాహన కుదిరిందని, బిజెపి రాష్ట్రంలోని 42 లోకసభ స్థానాలపై కన్నేసిందని, ఏ మాత్రం సీట్లు వచ్చిన అది బిజెపికి లాభమేనని అంటున్నారు.
బిజెపి అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్, పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సూచనల మేరకే మనోహర్ పరికర్ హైదరాబాద్ వచ్చినట్లు చెబుతున్నారు. బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డికి కూడా తెలియకుండా మనోహర్ పరికర్ హైదరాబాద్ వచ్చి వెళ్లిపోయారని టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది. నగరంలోని సన్నిహిత మిత్రుడి నివాసంలో జరిగిన ఓ కార్యక్రమానికి కూడా ఆయన హాజరయ్యారట. మనోహర్ పరికర్ హైదరాబాద్ పర్యటన వ్యక్తిగతమైందేనని, దానికి రాజకీయ ప్రాధాన్యం లేదని బిజెపి నేతలు ఆ తర్వాత కొట్టి పారేసే ప్రయత్నాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications