జగన్తో దోస్తీ, తెలంగాణ: తీవ్రఒత్తిడిలో మజ్లిస్
నిన్నటి వరకు కాంగ్రెసు పార్టీతో చెట్టాపట్టాల్ వేసుకొని తిరిగిన మజ్లిస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక.. తమ వ్యక్తిగత లబ్ధికి సహకరించడం లేదనే కారణంతోనే తమ పార్టీతో తెగతెంపులు చేసుకున్నారని కాంగ్రెసు నేతలు చెబుతున్నారు. అయితే అదే సమయంలో ముస్లింల ప్రతినిధిగా చెప్పుకుంటున్న మజ్లిస్ నేతలకు ధీటుగా ముఖ్యమంత్రి ఆ వర్గానికి అండగా నిలబడుతున్నారని అంటున్నారు.
పాతబస్తిలో మజ్లిస్ దశాబ్దాలుగా రాజ్యమేలుతుందని కానీ, అక్కడి ముస్లింల బాగును ఏనాడు పట్టించుకోలేదని, ముఖ్యమంత్రి మాత్రం మజ్లిస్ ముఖ్య నేతల స్వలాభాన్ని పక్కన పెట్టి ముస్లిం వర్గాలకు అండగా నిలబడుతున్నారని, దీంతో మజ్లిస్ ముఖ్యమంత్రిపై ఆగ్రహంతో కాంగ్రెసు పార్టీకి మద్దతు ఉపసంహరించుకుందని చెబుతున్నారు. అదే సమయంలో జగన్ పార్టీతో కలిసేందుకు సిద్దమయ్యారంటున్నారు.
కాంగ్రెసుతో తెగతెంపుల అనంతరం జగన్ పార్టీతో కలిసి వెళ్లేందుకు సిద్దమైనా ప్రస్తుత పరిస్థితి జగన్కు అనుకూలంగా లేదు. దీంతో ఇన్నాళ్లు తాము చెప్పింది జరగడం... ఇప్పుడు అందుకు విరుద్దంగా ఉండటంతో వారిలో ఒత్తిడి పెంచిందంటున్నారు. అదే సమయంలో కాంగ్రెసు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందనే ప్రచారం, తెలంగాణకు బిజెపి ప్రధానంగా మద్దతు ప్రకటిస్తుండటంతో.. ఆ పార్టీ క్రమంగా బలం పుంజుకుంటోంది.
తాము మద్ద శత్రువుగా భావించి బిజెపి ఉనికి తెలంగాణలో క్రమంగా పెరగడం ఆ పార్టీ జీర్ణించుకోలేక పోతోంది. తెలంగాణ విషయంలో బిజెపి తమను టార్గెట్ చేసుకోవాడన్ని కూడా మజ్లిస్ సీరియస్గానే తీసుకుందట. ఓ వైపు పాతబస్తీకే పరిమితమైన తాము రాష్ట్రంలో చక్రం తిప్పాలనుకుంటున్న సమయంలో బిజెపి బలం పెంచుకోవడం, కాంగ్రెసుతో తెగతెంపుల కారణంగా పనులు కాకపోవడం, జగన్తో దోస్తీ కట్టినా అతని పరిస్థితే బాగా లేకపోవడం వంటి కారణాల చేత వారిలో ఒత్తిడి మరింత పెరిగి ఉండవచ్చునని అంటున్నారు.