వైయస్ జగన్ను జయప్రద జైల్లో కలుస్తారా?
రాజమండ్రిలో కాంగ్రెసు ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ను, తెలుగదేశపార్టీ తరఫున పోటీ చేసే మురళీమోహన్ను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున ఢీకొట్టేందుకు ఆమె మానసికంగా సిద్ధమైనట్లు చెబుతున్నారు. తన 52వ జన్మదిన వేడుకలను జరుపుకోవడానికి జయప్రద మంగళవారం తిరుమల వచ్చారు.
తిరుమలలో ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ నెల 30వ తేదీన తాను ఏ పార్టీలో చేరేదీ చెబుతానని అన్నారు. నిరంతరం ప్రజాసమస్యలపై పోరాటం చేసే సెక్యులర్ పార్టీలో చేరుతానని ఆమె చెప్పారు. అయితే, పనిలో పనిగా వైయస్ రాజశేఖర రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తారు. సమస్యలతో సతమతమవుతున్న రాష్ట్రానికి వైయస్ రాజశేఖర రెడ్డి వంటి నాయకుడు కావాలని ఆమె అన్నారు.
సస్యశ్యామలమైన ఆంధ్రప్రదేశ్ కోసం కృషి చేసి అందరిలోనూ చిరస్థాయిగా నిలిచిపోయిన వైయస్ లాంటి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, ప్రజా సమస్యలపై క్షేత్ర స్థాయిలో తెలుసుకునేందుకు వైయస్ షర్మిల చేస్తున్న పాదయాత్ర అభినందనీయమని ఆమె అన్నారు. ఆమె మాటలను బట్టి వైయస్ పాలనను తెస్తానని అంటున్న వైయస్ జగన్నే ఆమె తన నాయకుడిగా చూస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఆమె వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారనే విషయంలో సందేహం అక్కర్లేదని అంటున్నారు.