భళారే విచిత్రం: షర్మిల యాత్రలో సీనియర్ ఎన్టీఆర్
ఇంతకు ముందు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తమ పార్టీ నేతలతో కలిపి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఇప్పుడు సీనియర్ ఎన్టీ రామారావు ఫ్లెక్సీలను కూడా తమ పార్టీ కోసం ఏర్పాటు చేసుకున్నారు. షర్మిల పాదయాత్రలో ఎన్టీఆర్ రామారావు ఫొటో కనిపించింది.
కృష్ణాజిల్లా పెడనలో షర్మిల పాదయాత్ర సందర్భంగా బుధవారం ఆ విచిత్రం చోటు చేసుకుంది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండి ఇటీవలే వైయస్సార్ కాంగ్రెసులో చేరిన మాజీ జడ్పీటీసీ సభ్యుడు ఉప్పాల రాంప్రసాద్ అభిమానులు ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.
ఇంతకుముందు ఒకసారి ఇలాగే మచిలీపట్నంలో ఒక ఫ్లెక్సీపై జూనియర్ ఎన్టీఆర్ ఫొటో ముద్రించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా అన్నగారి ఫొటోనే వైసీపీ ఫ్లెక్సీపై ముద్రించడం చర్చనీయాంశంగా మారింది. తన ఫొటోలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు వాడుకోవడంపై జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు పెదవి విప్పడం లేదు. మొత్తంగా చంద్రబాబుకు జగన్ పార్టీ నేతలు ఊహించని కష్టాలను తెచ్చి పెడుతున్నారు.