తెలంగాణ అనగానే రాహుల్ లేచిపోయారు!
తెలంగాణ అంశాన్ని సుధాకర్ రెడ్డి లేవనెత్తగానే రాహుల్ గాంధీ లేచి వెళ్లిపోయారని చెబుతున్నారు. అయితే, తెలంగాణ అంశంపై విడిగా చర్చిద్దామని, దాని గురించి ఆలోచిస్తున్నామని రాహుల్ గాంధీ చెప్పినట్లు సుధాకర్ రెడ్డి చెప్పుకుంటున్నారు. తెలంగాణ అంశాన్ని పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రస్తావించినప్పుడు రాహుల్ గాంధీ కాస్తా అసౌకర్యానికి గురి కావడంతో పార్టీని వ్యవస్థాగతంగా బలోపేతం చేయడానికి సూచనలు ఇవ్వాలని ఆజాద్ సూచించారట.
తెలంగాణ అంశం కూడా పార్టీని పటిష్టం చేయడంలో ఒక భాగమని సుధాకర్ రెడ్డి చెప్పారని అంటున్నారు. తెలంగాణ అంశాన్ని పరిష్కరిస్తే, అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరిస్తే తెలంగాణ ప్రాంతంలో పార్టీ బలోపేతం అవుతుందని సుధాకర్ రెడ్డి చెప్పదలుచుకున్నారు. కానీ, రాహుల్ గాంధీ ఆ మాట వినడానికి ఇషటపడలేదని చెబుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రాహుల్ గాంధీయే కాస్తా వ్యతిరేకంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అది ఎంత వరకు నిజమో తెలియదు. కానీ, తెలంగాణను తేల్చే విషయం మాత్రం వాయిదా పడింది. ఈ నెల 20వ తేదీన తెలంగాణపై సమావేశం ఏర్పాటు చేస్తామని తాజాగా కేంద్ర మంత్రి వాయలార్ రవి చెప్పారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి విడిగా కసరత్తు జరుగుతున్నందున ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదనేది రాహుల్ ఆంతర్యమని తెలంగాణ నేతలు సర్దిచెప్పుకుంటున్నారు.