రఘువీరా: సిఎంగానా, పిసిసి చీఫ్గానా?
రాయలసీమకు చెందిన బిసి రఘువీరారెడ్డికి సోనియా గాంధీ కీలకమైన బాధ్యతలు అప్పగించడానికి నిర్ణయించుకున్నారని, అందుకే ఆయనతో దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడారని అంటున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్థానంలో రఘువీరా రెడ్డిని నియమించవచ్చుననే ఊహాగానాలు కూడా చెలరేగుతున్నాయి. లేదంటే పిసిసి అధ్యక్షుడిగా ఆయనను నియమించే అవకాశాలున్నాయా అనే కోణంలో కూడా ఆలోచన సాగుతోంది.
పార్టీని గాడిలో పెట్టి వచ్చే ఎన్నికల్లో అత్యధిక లోకసభ స్థానాలను రాష్ట్రం నుంచి గెలుచుకునే దిశలో కాంగ్రెసు అధిష్టానం ప్రణాళికను తయారు చేస్తోందని, ఇందులో భాగంగా అవసరమైతే ముఖ్యమంత్రిని గానీ పిసిసి అధ్యక్షుడిని గానీ మార్చవచ్చునని అంటున్నారు.
రఘువీరా రెడ్డి ముఖ్యమంత్రి రేసులో ఉన్నట్లు గతంలో ప్రచారం సాగింది. ముఖ్యమంత్రితో అత్యంత సన్నిహితంగా ఉండే రఘువీరా రెడ్డి దూరం జరగడంపై కూడా అనుమానాలు రేకెత్తాయి. అయితే తాను ముఖ్యమంత్రి రేసులో లేనని రఘువీరా రెడ్డి చెప్పారు. మొత్తం మీద, కాంగ్రెసులో భారీ మార్పులు జరగడానికి సంకేతంగా రఘువీరా రెడ్డితో సోనియా గాంధీ మంతనాలను భావిస్తున్నారు.