స్పైడర్ మ్యాన్: దొంగతనానికి వచ్చి నిద్రపోయాడు
అహ్మదాబాద్: పోలీసు వర్గాలు అతన్ని స్పైడర్ మ్యాన్గా పిలుస్తారు. అత్యంత ఎత్తుగల భవనాల్లో కూడా దొంగతనాలకు పాల్పడే నేర్పు కారణంగా అతన్ని పోలీసులు అలా పిలుస్తారు. విజయ్ ఠాకూర్ అనే 29 ఏళ్ల ఆ మహా చోరుడు అహ్మదాబాద్లోని ఆనందనగర్లో గల రోజ్వుడ్ అపార్టుమెంట్స్లో చోరీకి ప్రయత్నించి పట్టుబడ్డాడు. గత మూడేళ్లలో అతను పోలీసులకు పట్టుబడడం ఇది రెండోసారి.
అతను దొంగతనానికి వచ్చి నిద్రపోయాడట. దానివల్లనే అతను పట్టుబడ్డాడని అంటున్నారు. రెసిడెంట్స్ పోలీసుల కంట్రోల్ రూంకు చెప్పడంతో పోలీసులు వచ్చి అతన్ని పట్టుకున్నారు. తాను షూట్ బూట్లు వేసుకోవడంతో సెక్యూరిటీ గార్డు తనను ఆపలేదని, దాంతో తాను రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆపార్టుమెంటులోకి ప్రవేశించానని, చివరి అంతస్థుకు వెళ్లి కిందికి దిగుతూ ఒక్కో ఫ్లాట్ను పరిశీలిస్తూ వచ్చిన సురేంద్ర పటేల్ అనే ఎన్నారై ఫ్లాట్ను ఎంచుకున్నానని అతను పోలీసులకు చెప్పాడు.
అర్థరాత్రి దాటిన తర్వాత ఒంటి గంటన్నర ప్రాంతంలో బయటకు రావాలని అనుకున్నాడు. అయితే చాలా ఏళ్లుగా ఎవరూ లేకపోవడంతో ఇంట్లో అతనికి విలువైన వస్తువులేవీ దొరకలేదు. తెల్లారిన తర్వాత వెళ్లిపోదామని అనుకుని నిద్రపోయాడు. తెల్లవారు జామున ఐదు గంటలకు వెళ్లిపోదామని అనుకున్నాడు. కానీ వెళ్లలోకపోయాడు. ఏడు గంటల ప్రాంతంలో తలుపు తెరిచి ఉండడాన్ని స్వీపర్ చూసి బిల్డింగ్ సెక్రటరీకి చెప్పింది. పోలీసులకు చెప్పడంతో వారు వచ్చి అతన్ని అరెస్టు చేశారు.
ఠాకూర్ గతంలో మూడేళ్ల క్రితం కూడా ఇదే అపార్టుమెంటులో పట్టుబడ్డాడు. అప్పుడు అతను ఖాళీ ఫ్లాట్లోకి ప్రవేశించాడు. అతనికి దొరికిన తాళం చెవి పనిచేయలేదు. మెయిన్ డోర్ క్లోజ్ కావడంతో బయటకు రాలేకపోయాడు. తగిన సమయంలో బయటపడకపోవడంతో ఇరుగుపొరుగు వారు చూసి పోలీసులలను పిలిచారు. దాంతో అప్పుడు పట్టుబడ్డాడు.