కోహ్లీ హ్యాపీ: అనుష్క వెళ్లేందుకు బిసిసిఐ ఓకె
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) తాజాగా తీసుకున్న నిర్ణయం క్రికెటర్ విరాట్ కోహ్లీ, అతడి ప్రియురాలు, బాలీవుడ్ నటి అనుష్క శర్మ పాలిట వరమైంది. ఇక అనుష్క శర్మతో కొత్త సంవత్సరంలో కోహ్లీ సంబరాలు చేసుకోవచ్చు. విదేశీ పర్యటనలో ఆటగాళ్లు.. తమ ప్రియురాళ్లను వెంట తీసుకెళ్లడంపై ఇటీవల విధించిన నిషేధాన్ని బిసిసిఐ తొలగించింది.
దీంతో ఆటగాళ్లు తమ భార్యలనే కాక.. ప్రియురాళ్లను కూడా ఆస్ట్రేలియాలో ఆటగాళ్లను కలుసుకోవచ్చు. కానీ, ఏ ఆటగాడు కూడా ప్రియురాలితో కలిసి గదిని పంచుకోరాదని బిసిసిఐ షరతు విధించింది. అంటే కోహ్లీతో కలిసి అనుష్క చెట్టాపట్టాల్ వేసుకొని తిరగొచ్చు. ఇద్దరూ కలిసి ఒకే గదిలో ఉండటానికి మాత్ర వీల్లేదు.
టెస్ట్ సిరీస్ ముగిసేంత వరకు ఆటగాళ్లతో వారి భార్యలు ఉండేందుకు ముందు అనుమతించిన బిసిసిఐ.. ఇప్పుడు ప్రియురాళ్లను కూడా అనుమతిచ్చి ఆటగాళ్లకు వారికి గొప్ప సాయమే చేసింది. కాగా, భార్యలను అనుమతించి.. ప్రియురాళ్లపై నిషేధం విధించడంలో అర్థం లేదని బిసిసిఐ కార్యదర్శి సంజయ్ పటేల్ అభిప్రాయపడ్డారు
కేవలం భార్యలను మాత్రమే అనుమతించాలని గట్టిగా ఓ నిబంధన పెట్టుకోవడంలో అర్థం లేదనీ.. ప్రియురాళ్ల విషయంలో కూడా తమకేలాంటి అభ్యంతరం లేదని ఆయన చెప్పారు. అయితే ఆటగాళ్ల భార్యలకు మాత్రమే వారి గదిలో ఉండటానికి అనుమతిస్తున్నామని, ప్రియురాళ్లకు అనుమతి లేదని వెల్లడించారు.