ఆయుధాలతో అసెంబ్లీలోకి జగన్ అంగరక్షకులు?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షనేత జగన్ వ్యక్తిగత అంగరక్షకులు అసెంబ్లీలోకి ఆయుధాలతో రావడం పట్ల పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి.
అసెంబ్లీ సమావేశం తొలి రోజు పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి జగన్ బస్సులో వచ్చారు. ఆయనతోపాటు గన్మెన్ కూడా అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చారు. జగన్ ప్రత్యేకంగా నియమించుకున్న ఇద్దరు ప్రైవేటు అంగరక్షుకులు లాబీల్లోకి ఆయుధాలతోనే వచ్చారు. ఇది గమనించిన ఎస్పీఎఫ్ పోలీసులు ఆయుధాలను లోపలికి తీసుక రాకూడదని అభ్యంతరం వ్యక్తం చేశారని వార్తలు వచ్చాయి.
తాము జగన్ కు ప్రత్యేక భద్రత కల్పిస్తున్నామని, 24 గంటలూ జగన్ వెంటే ఉంటామని దురుసుగా మాట్లాడారని వార్తలు వచ్చాయి. వారు ఏఆర్ పోలీసులు కాదని గుర్తించిన ఎస్పీఎఫ్ సిబ్బంది వారి వివరాలడగడంతో ప్రైవేట్ వ్యక్తులని తేలింది. ఆయుధాలతో ప్రైవేట్ భద్రత సిబ్బంది అసెంబ్లీ ప్రాంగణంలోకే రాకూడదని, అలాంటిది ఏకంగా లాబీల్లోకి రావడం నేరమని హెచ్చరించారు.
శుక్రవారం కూడా ఆ వ్యక్తులే మళ్లీ జగన్తోపాటు అసెంబ్లీకి ఆయుధాలతో వచ్చారు. దీంతో అసెంబ్లీ చీఫ్ మార్షల్ రంగంలోకి దిగి ఆయుధాలు స్వాధీనం చేసుకొని ఇంటెలిజెన్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారని వార్తలు వచ్చాయి. దీంతో వైయస్ జగన్ వివాదంలో చిక్కుకున్నారు.