చిరంజీవి: వీటికి తక్కువ, వాటికి ఎక్కువ?
హైదరాబాద్: కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి తన భవిష్యత్తును ప్రణాళిక ప్రకారం రూపొందించుకుంటున్నట్లు తెలుస్తోంది. సినిమా రంగంలో ఓ వెలుగువెలిగిన చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళాక అక్కడి పరిస్థితులకు తలొగ్గి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపిన సంగతి తెలిసిందే. ప్రచార బాధ్యతలను నెత్తికెత్తుకున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి కాంగ్రెసును కాపాడలేకపోయారు.
ప్రస్తుతం రాజకీయ వ్యాపకాలు పెద్దగా లేవు కాబట్టి సినిమాపై దృష్టంతా పెడుతున్నాడు. ఇప్పటికే బోల్డన్ని కథలు విన్నట్లు మెగా వర్గాలు చెబుతున్నాయి. అప్పుడప్పుడు అధిష్టానం పెద్దలతో సమావేశాలకు హాజరవుతూ తన 150వ సినిమాను పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు.
రాజకీయాల్లోకి రాకముందే ఆయన నటించబోయే 150వ సినిమా పెద్ద ట్రెండ్ సెట్టర్ కావాలని కోరుకున్నారు. అందుకు ఉద్దండులైన కొందరు దర్శకులు, రచయితలు కూడా తలో చేయి వేశారు. మొత్తంగా పోరాట యోధుని కథ తెర మీదికి వచ్చింది. అయితే ఆ తర్వాత వివి వినాయక్ పేరు తెరపైకి వచ్చింది.
ప్రస్తుతం వినాయక్ 'అల్లుడు శ్రీను' సినిమా బిజీలో ఉన్నప్పటికీ చిరంజీవికి సినిమా చేసి పెట్టాలనే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నరాు. ఇప్పటికే వినాయక్ ఓ కథ విన్పించారనీ, దానికి తుదిమెరుగులు దిద్దాక ఓ రూపం వస్తుందని వార్తలు విన్పిస్తున్నాయి. ఈ మధ్య ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి అనే యోధుడి కథ కూడా తెర మీదికి వచ్చింది.