కేసీఆర్ ఝలక్: ఎర్రబెల్లి ఆగ్రహం, గన్మెన్లు వెనక్కి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు భద్రతను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుదించింది. ఆయనకు రక్షణగా ఉన్న ఎస్కార్ట్ను సర్కార్ తొలగించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పైన ఎర్రబెల్లి దయాకర రావు తీవ్ర ఆగ్రహం, అసంతృప్తితో ఉన్నారు.
ప్రత్యర్థుల నుంచి ప్రాణహాని ఉందని తెలిసినప్పటికీ తెలంగాణ సర్కార్ తనకు ఎస్కార్ట్ తొలగించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యలకు నిరసనగా ఆయన తన గన్మెన్లను కూడా వెనక్కి పంపించారు. కేవలం కక్ష సాధింపు చర్యలలో భాగంగానే తన ఎస్కార్ట్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలగించిందని ఎర్రబెల్లి ఆరోపించారు.
తనకు ఏమైనా జరిగితే తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ అవలంభిస్తున్న విధానాలు తుగ్లక్ పరిపాలనను గుర్తుకు తెస్తున్నాయని ఆయన అంతకుముందు విమర్శించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ నెరవేర్చకుండా ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబులను దూషించడం ఎంత వరకు సమంజసమన్నారు. కేసీఆర్ను కేంద్రం బఫూన్లా చూస్తోందన్నారు.
కాగా, ఇటీవలి కాలంలో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే. టీడీపీ నేతలు రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి, మోత్కుపల్లి నర్సింహులు, నర్సిరెడ్డి తదితరులు కేసీఆర్ స్థానికతను ప్రశ్నిస్తున్నారు. పేర్ల మార్పు విషయానికి వచ్చేసరికి.. ముందు కేటీఆర్ పేరు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.