తెలంగాణ ఖాయం: విభజనపై జగన్కు క్లారిటీ?
హైదరాబాద్: 2014 ఎన్నికలలోపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరుగుతుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, కడప పార్లమెంటు సభ్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి బలంగా నమ్ముతున్నారట. సీమాంధ్రకు చెందిన పలువురు కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నేతలు విభజన ఆగే పరిస్థితి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే, సమైక్యం కోసం పట్టుబడుతున్న జగన్కు విభజన విషయంలో క్లారిటీ ఉందని అంటున్నారు. విడిపోతుందని ఆయన బలంగా నమ్ముతున్నారట. పార్టీకి చెందిన ఓ నాయకుడితో జగన్ విభజనపై గందరగోళం వద్దని స్పష్టంగా చెప్పారట.
శనివారం జగన్ టెలీకాన్ఫ్రెన్స్లో మాట్లాడుతుండగా ఓ నాయకుడు విభజన విషయంలో గందరగోళంలో ఉన్నామని చెప్పారట. దానికి జగన్ స్పందిస్తూ గందరగోళం నుంచి అందరూ బయటపడాలని, తెలంగాణ ఖాయమని స్పష్టం చేశారని వార్తలు వస్తున్నాయి.
రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయని, త్వరలో సీమాంధ్రకి చెందిన యాభై స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తామని పార్టీ సమన్వయకర్తలకు సూచించారట. తెలంగాణలో సైతం ఎవరైనా ముందుకొస్తే టిక్కెట్లు ఇచ్చేందుకు జగన్ సై అన్నారట. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఓటు బ్యాంకును పెంచుకోవడానికి ఫిబ్రవరే కీలకమని, సమన్వయకర్తలందరూ ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.
మరోవైపు 30వ తేది నాటికి హైదరాబాద్కు చేరుకునే జగన్, బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చే సమయానికి సీమాంధ్ర జిల్లాల్లో 'సమైక్య గళం' విన్పిస్తూ భారీ ఎత్తున బహిరంగ సభలు నిర్వహించాలని భావిస్తున్నారట.