మహేశ్వర్రెడ్డి కోసం వివేక్ చక్రం!, పీఆర్పీ నేతగా..
అదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్యకు అధిష్టానం ఝలక్ ఇచ్చింది. ఆయన వర్గానికి చెందిన అదిలాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు భార్గవ్ దేశ్ పాండేను హఠాత్తుగా తొలగించింది. ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని నియమించింది.
పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని నియమిస్తూ ఆ పా ర్టీ అధిష్ఠానం గురువారం ఉత్తర్లు జారీ చేసింది. కొద్ది రోజులుగా డీసీసీ అధ్యక్షుడిగా మహేశ్వర్ రెడ్డి పేరు ఖాయమైందన్న ప్రచారం జరుగుతోంది. జిల్లాలోని సీనియర్ నేతలంత అధ్యక్ష పదవికి మహేశ్వర్ రెడ్డి పేరునే బలపర్చడం, ఎలాంటి గ్రూపులు తెరపైకి రాకపోవడంతో అధిష్ఠానం ఆయన నియమకానికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటున్నారు.
2009లో అ నూహ్యంగా రాజకీయ అరంగేట్రం చేసిన మహేశ్వర్ రెడ్డి పలు సంచలనాలకు కారకుడయ్యారు. సామాజిక సేవలు, వ్యక్తి గత పలుకుబడితో ఆయన అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇంద్రకరణ్ రెడ్డిని ఓడించారు. అనంతరం ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం కావడంతో ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యేగా మారారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రమక్రమంగా ఎదిగారు.
డీసీసీ మాజీ అధ్యక్షుడు సీ రాంచంద్రారెడ్డి ఆశీస్సులతోపాటు మాజీ ఎంపీ వివేక్ అండదండలతో మహేశ్వర్రెడ్డి జిల్లాలో ఓ ప్రత్యేక స్థాయికి ఎదిగారు. క్రమంగా పార్టీ పై పూర్తి పట్టు సాధించడమే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన నేపథ్యంలో సోనియాకు కృతజ్ఞతలు సభ పేరిట మహేశ్వర్ రెడ్డి నిర్మల్లో భారీ బహిరంగ సభ నిర్వహించి జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహేశ్వర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అయినా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగానే పాల్గొంటూ జిల్లాలోని ఆ పార్టీ నేతలందరితో రాజకీయాలపై సంప్రదింపులు జరుపుతున్నారు. ఇలాంటి క్రమంలోనే పార్టీ నేతలంతా డీసీసీ అధ్యక్ష పదవికి మహేశ్వర్ రెడ్డి పేరును ఏకగీవ్రంగా సూచించారంటున్నారు.
కాగా, పొన్నాల వ్యతిరేకవర్గం సిఫార్సు మేరకు ఈ మార్పులు జరిగిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. గత ఆగస్టు నెలలో అదిలాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాలకు కొత్త అధ్యక్షులుగా దేశ్ పాండే, జగ్గారెడ్డి, క్యామ మల్లేష్లను నియమించారు. దీనిపై అప్పట్లో అసమ్మది భగ్గుమంది. అనంతరం జగ్గారెడ్డి బీజేపీలో చేరారు. మాజీ మంత్రి సునితా లక్ష్మారెడ్డిని మెదక్ జిల్లా అధ్యక్షురాలిగా నియమించారు.
అయితే, అదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులను కొనసాగించాలని పొన్నాల లక్ష్మయ్య అధిష్టానాన్ని కోరారు. అయితే, మాజీ ఎంపీ వివేక్ ఢిల్లీకి వెళ్లి చక్రం తిప్పడంతో దేశ్ పాండేను తొలగించి మహేశ్వర్ రెడ్డిని నియమించారని అంటున్నారు. తన ప్రమేయం లేకుండా మహేశ్వర్ రెడ్డి నియాకం జరగడం పొన్నాలను అసంతృప్తికి గురి చేసిందని తెలుస్తోంది.