టీ బిల్లుపై అసెంబ్లీలో చర్చ: చంద్రబాబు సేఫ్?
హైదరాబాద్: శాసనసభలో తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ నుంచి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు సురక్షితంగా బయటపడ్డారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీర్మానానికి నోటీసు ఇవ్వడంతో సభలో చర్చ కొనసాగడం అసాధ్యంగా మారింది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రసంగించి బిల్లును తిరస్కరిస్తూ వెనక్కి పంపించాలని సభ తీర్మానం చేయాలని కోరుతూ స్పీకర్కు నోటీసు ఇచ్చారు.
కిరణ్ కుమార్ రెడ్డి నోటీసుపై ఇరు ప్రాంతాల శాసనసభ్యులు సభలో గందరగోళం సృష్టించారు. తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టాలని సీమాంధ్ర సభ్యులు, నోటీసును తిరస్కరించాలని తెలంగాణ ప్రాంత సభ్యులు సభలో ప్రతి రోజూ పట్టుబడుతూ వచ్చారు. దీంతో సభా కార్యక్రమాలు జరగలేదు. సోమవారంనాడు తాను అన్ని విషయాలూ సభలో చెప్తానని చంద్రబాబు నాయుడు శనివారంనాడు అన్నారు.

కానీ, సోమవారం నుంచి సభా కార్యక్రమాలు స్తంభించడంతో ప్రసంగించే అవకాశం చంద్రబాబుకు రానే లేదు. ఆయనకు అవకాశం రాకుండానే బిల్లును తిరస్కరిస్తూ సభ నిర్ణయం తీసుకుంది. తెలంగాణపై రెండు కళ్ల సిద్ధాంతాన్ని చంద్రబాబు అనుసరిస్తున్నారంటూ ఇతర రాజకీయ పార్టీల నుంచి విమర్శలు రావడం పరిపాటిగా మారింది. సీమాంధ్ర శాసనసభ్యులు విభజనకు వ్యతిరేకంగా, తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు విభజనకు అనుకూలంగా తమ వాదనలు వినిపిస్తూ కార్యక్రమాలు తీసుకున్నారు.
ఆ స్థితిలో చంద్రబాబు కరవబోతే కప్పకు కోపం, వద్దంటే పాముకు కోపం అన్నట్లుగా చంద్రబాబు పరిస్థితి మారిందని, సభలో తన వైఖరిని సమర్థించుకునేందుకు చంద్రబాబుకు అవకాశం ఉండదని అందరూ భావించారు. ఈ స్థితిలో చంద్రబాబు తెలంగాణ ముసాయిదా బిల్లుపై ఏం చెప్తారనేది కూడా ఆసక్తిగా మారింది. అయితే, చంద్రబాబు తన వైఖరిని చెప్పాల్సిన అవసరం లేకుండా పోయింది. దీంతో ఆయన సురక్షితంగా బయటపడ్డారని అంటున్నారు.












Click it and Unblock the Notifications