బాబుకు పవన్ షాక్: పివి ప్రసాద్ కోసమేనా?
హైదరాబాద్: జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ ఆంతర్యం ఏమిటో బోధపడడం లేదు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో కలిసి నడవడానికి సిద్ధపడిన పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా రూట్ మార్చేశారు. తాను తెలుగుదేశం పార్టీకి గానీ ఇతర ప్రాంతీయ ప్రాంతీయ పార్టీలకు గానీ మద్దతు ఇవ్వబోనని ప్రకటించి ఆయన చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. ఈ షాక్ వెనుక ఆంతర్యమేమిటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
పవన్ కళ్యాణ్కు కూడా రాజకీయాలు ఆడడం వచ్చునని తాజా సంఘటన రుజువు చేస్తోందని చెవులు కొరుక్కుంటున్నారు. తెలుగుదేశం పార్టీతో, బిజెపితో పొత్తుకు సిద్ధపడుతూ తనకు సన్నిహితుడైన పివి ప్రసాద్ కోసం పవన్ కళ్యాణ్ విజయవాడ లోకసభ సీటు అడిగారని సమాచారం.
అయితే, పివి ప్రసాద్కు విజయవాడ సీటు కేటాయించడానికి చంద్రబాబు ముందుకు రావడం లేదు. ప్రసాద్కు సీటు ఇస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని చంద్రబాబుతో సహా బిజెపి నాయకులు కూడా అన్నట్లు సమాచారం. ఈ స్థితిలోనే ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వబోనని చెప్పినట్లు భావిస్తున్నారు.
తన మద్దతు కేవలం బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి మాత్రమేనని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు జనసేన ఓ ప్రకటన విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ తాజా ప్రకటనతో తెలుగుదేశం పార్టీ ఇరకాటంలో పడినట్లు చెబుతున్నారు.