సినీ నటి ఫిర్యాదు: రైల్వేమంత్రి కొడుకుపై రేప్ కేసు
బెంగళూరు: కేంద్ర రైల్వే శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ తనయుడు కార్తీక్ గౌడ నిశ్చితార్థం బుధవారం వివాదాలకు తావిచ్చింది. మడికెర జిల్లా కుశాలనగర తాలుకా మాదపట్టణలోని ఓ రిసార్టులో స్వాతి అనే యువతితో జరిగిన నిశ్చితార్థానికి పరిమిత సంఖ్యలో మాత్రమే బంధువులను ఆహ్వానించారు.
స్థానిక శాసన సభ్యుడు అప్పచ్చురంజన్ మినహా మరే ఇతర నాయకులు హాజరు కాలేదు. ఓ వైపు నిశ్చితార్థం జరుగుతుండగా మరోవైపు కార్తీక్ గౌడ తనను ఇంతకుముందే వివాహం చేసుకున్నాడని సినీ నటి, మోడల్ మైత్రేయ బెంగళూరులో తెలిపింది. తనకు అన్యాయం చేయవద్దని విజ్ఞప్తి చేసింది.
గత మే నెలలో పరిచయం అయిందని కొంత కాలానికే వివాహం చేసుకున్నాడని ఆమె చెబుతోంది. కార్తీక్ గౌడతో కలిసి ఉన్న ఫోటోలను మీడియాకు విడుదల చేసింది. ఈ వ్యవహారాన్ని సదానంద గౌడ తోసిపుచ్చారు. ఇది ఒక కుట్రగా సదానంద అభివర్ణించారు. కార్తీక్ గౌడ్ స్పందిస్తూ అసలు మైత్రేయ ఎవరో తనకు తెలియదని చెప్పారు. తన తండ్రి ఉన్నత స్థానంలో ఉన్నారని, ఆయన గౌరవానికి తాను భంగం ఎలా కలిగిస్తానని వ్యాఖ్యానించారు.
కాగా, మైత్రేయ ఆర్టీ నగర్ పోలీసు స్టేషన్లో సదానంద గౌడ తనయుడికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసినట్లు బెంగళూరు పోలీస్ కమిషనర్ తెలిపారు. తనను మోసం చేశాడని, అత్యాచారం చేశాడని ఆమె అందులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.