వెంకయ్యకు, కిషన్ రెడ్డికి మధ్య విభేదాలు?
హైదరాబాద్: కేంద్ర మంత్రి, బిజెపి జాతీయ నాయకుడు ఎం. వెంకయ్యనాయుడికి, తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డికి మధ్య విభేదాలు మరింత పెరిగినట్లు ప్రచారం జరుగుతోంది. నివురు గప్పిన నిప్పులా విభేదాలు ఉన్నట్లు చెబుతున్నారు. నిజానికి, వెంకయ్య నాయుడికి కిషన్ రెడ్డి అత్యంత సన్నిహితుడు.
వెంకయ్య నాయుడు బిజెపి జాతీయాధ్యక్షుడిగా ఉన్నప్పుడు కిషన్ రెడ్డి బిజెపి యువమోర్చా జాతీయాధ్యక్షుడిగా పనిచేశారు. తెలంగాణ అంశంపై ఇరువురికి మధ్య విభేదాలు వచ్చాయి. తెలంగాణ బిల్లును ఆమోదించడం నుంచి మొదలు పెడితే తెలుగుదేశం పార్టీతో పొత్తు వరకు ఇరువురి మధ్య విభేదాలు భగ్గుమంటూ వచ్చాయి.
ఈ స్థితిలో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంకయ్య నాయుడు హైదరాబాద్ వచ్చారు. ఆయనకు హైదరాబాదులో ఘనస్వాగతం లభించింది. అయితే, వెంకయ్యను స్వాగతించినవారిలో కిషన్ రెడ్డి లేకపోవడంతో పలువురు కనుబొమ్మలు ఎగురేశారు.
కిషన్ రెడ్డి వ్యక్తిగత పనుల మీద బెంగళూర్ వెళ్లడం వల్ల రాలేకపోయారని బిజెపి వర్గాలు చెప్పాయి. అయితే, ఆయన కావాలనే పనులు పెట్టుకున్నారని అంటున్నారు. వెంకయ్య నాయుడికి బండారు దత్తాత్రేయ, లక్ష్మణ్ తదితరులు స్వాగతం చెప్పారు.