దుష్టశక్తులపై కెసిఆర్ పోరు: పది రోజుల చండీయాగం
హైదరాబాద్: దుష్టశక్తులపై విజయానికి అదృశ్య శక్తుల శక్తులను కూడగట్టుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సిద్ధమయ్యారు. జ్యోతిషంపై విపరీతమైన నమ్మకం ఉన్న కెసిఆర్ ఆయత చండీయాగం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ ఆయుత చండీయాగాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తన నియోజకవర్గం గజ్వెల్లో చేయనున్నారు.
యాగం సందర్భంగా వేయి మంది పూజారులు తెరిపి లేకుండా పది రోజుల పాటు మంత్రాలు జపిస్తారు. అదృశ్య శక్తులను పొందడానికి ఈ యాగం పనికి వస్తుందని నమ్ముతారు. దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి పది వేల సార్లు 700 మంత్రాలను చదువుతారు. వంద యజ్ఢ గుండాలను ఏర్పాటు చేస్తారు. శత్రువులపై ఆధిపత్యం సాధించడానికి ప్రాచీన కాలంలో రాజులు ఈ యాగం చేసేవారు.
ఈ యాగంలో శత్రు సంహార, రాజ వశీకరణ మంత్రాలను జపిస్తారు. ఇతరుల బుద్ధిని, ఆలోచనలను, చర్యలను నియంత్రించడానికి అవసరమైన మార్మిక శక్తిని, తాంత్రిక శక్తులను రాజ వశీకరణ మంత్రం ఉపయోగపడుతుందని నమ్ముతారు. ఈ యాగానికి కెసిఆర్ కర్ణాటకలోని శృంగేరి పూజారిని రప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. చండీయాగ నిర్వహణలో ఆయన నిష్ణాతులని అంటారు.
శత్రువులను తరుచుగా ఎదుర్కునేవారు శత్రు సంహార హోమం చేస్తారని అటారు. శత్రువుల నుంచి, చెడు దృష్టుల నుంచి, శాపాల నుంచి ఇది కాపాడుతుందని విశ్వసిస్తారు. చండీయాగ నిర్వహణకు కెసిఆర్ ఫామ్ హౌస్లో ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. శృంగేరీ మఠానికి చెందిన ఇద్దరు పూజారులు ఫణిశంకర్ శర్మ, గోపికృష్ణ శర్మ యాగం చేసే స్థలాన్ని సోమవారంనాడు సందర్శించారు.
కెసిఆర్ ఈ యాగాన్ని తన వ్యక్తిగత ప్రయోజనం చేయడం లేదని, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని దుష్టశక్తుల నుంచి కాపాడి, సంపద్వంతం చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారని అంటున్నారు. ఈ యాగం చేయడం అంత సులభం కాదని అంటారు. గతంలో ఇందిరా గాంధీ, దేవేగౌడ, రాజీవ్ గాంధీ ఈ యాగం నిర్వహించారు.