పయ్యావుల మనసు కరిగించిన టీ లాయర్లు
హైదరాబాద్: కరుడు గట్టిన సమైక్యవాది అయిన తెలుగుదేశం రాయలసీమ ప్రాంత శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్కు తెలంగాణ న్యాయవాదులు అండగా నిలిచారు. ఆయనకు రక్షణగా నిలుచున్నారు. తెలుగుదేశం సీమాంధ్ర నేత పయ్యావుల కేశవ్పై పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించినప్పుడు తెలంగాణ ప్రాంత లాయర్లు అడ్డుకుని ఆయనకు మద్దతుగా నిలిచారు.
పార్లమెంట్ ఎదురుగా ఉన్న విజయ్ చౌక్లో గురువారంనాడు ఈ సంఘటన జరిగింది. ఆ ప్రాంతంలో ఉన్న ఉభయ ప్రాంతాల ఉద్యమకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని బలవంతంగా తరలించారు. ఈ సమయంలో అక్కడే మీడియాతో మాట్లాడుతున్న పయ్యావుల కేశవ్ను కూడా బలవంతంగా ఎత్తుకొని తీసుకువెళ్ళి పోలీస్ వ్యాన్లో ఎత్తిపడేశారు.

ఆయన వ్యాన్లో కూర్చోవడం లేదని ఆగ్రహించి కేశవ్ను పోలీసులు వంచి ఆయనపైకి ఎక్కి కూర్చున్నారు. ఆ సమయంలో అదే వ్యాన్లో కొందరు తెలంగాణ ప్రాంత న్యాయవాదులు కూడా ఉన్నారు. కేశవ్తో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చూసి వారు ఆగ్రహించి పోలీసుల పైకి తిరగబడ్డారు. ఇందులో మహిళా లాయర్లు కూడా ఉన్నారు. దానితో పోలీసులు తగ్గి పయ్యావుల కేశవ్ నుంచి దూరంగా జరిగారు.
వ్యాన్ మాత్రం ఆపకుండా వారందరినీ కలిపి ఒక పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్ళి సాయంత్రం వరకూ ఉంచి ఆ తర్వాత వదిలిపెట్టారు. 'రాజకీయ విభేదాలు ఎలా ఉన్నా నా పట్ల వారి సంఘీభావం నా మనసును కదిలించింది' అని పయ్యావుల కేశవ్ ఓ ప్రముఖ తెలుగు దినపత్రికతో అన్నారు. సాయంత్రం తిరిగి వెళ్ళేటప్పుడు వారంతా ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకొని వెళ్ళారు.












Click it and Unblock the Notifications