వెంకయ్యపై ఒత్తిడి: యుటిగా హైదరాబాద్?
హైదరాబాద్: కేంద్రంలో బిజెపి తిరుగులేని మెజారిటీ సాధించడంతో సీమాంద్ర రాజకీయ నాయకులు మరోసారి హైదరాబాద్పై తమ కన్నేశారు. కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డియె ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. దీంతో రాష్ట్ర విభజనకు సంబంధించిన మార్పులు చేర్పులు చేయవచ్చుననే ఆశతో సీమాంద్ర నాయకులు ఉన్నట్లు కనిపిస్తున్నారు.
ముఖ్యంగా హైదరాబాద్ విషయంలో తమ కోరికను నెరవేర్చుకోవడానికి ఏమైనా సాధ్యమవుతుందా అనే ఆలోచనలో పడి ప్రయత్నాలు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం (యుటి)గా చేయాలని యుపిఎ ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. అయితే, అందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు.
నరేంద్ర మోడీ తన ఆశలను ఏమైనా నెరవేర్చగలరమో చూద్దామని అనుకుంటూ వెంకయ్య నాయుడిపై తీవ్రమైన ఒత్తిడి పెట్టినట్లు తెలుస్తోంది. హైదరాబాదును యుటిగా చేయాలని వారు కోరారట. అయితే, వెంకయ్య నాయుడు అందుకు అంగీకరించలేదని అంటున్నారు. హైదరాబాద్ను యుటి చేసి ఓ ప్రాంతాన్ని దెబ్బ తీయలేమని ఆయన అన్నట్లు తెలుస్తోంది.
అయితే, సీమాంధ్రకు ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పించడం సరిపోదని, దాని కాలపరిమితిని పెంచడానికి తాను ప్రయత్నాలు చేస్తానని వెంకయ్య నాయుడు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.