ప్లైట్లో పక్కసీట్లో స్థూలకాయుడు:ఇబ్బందిపడ్డానని కేసు
దుబాయ్: తన ప్రయాణానికి అసౌకర్యం కలిగించినందుకు ఎతిహాద్ ఎయిర్ వేస్ పైన ఓ ప్రయాణీకుడు కేసు పెట్టాడు. ఈ ఎయిర్ లైన్స్కు చెందిన 2011 విమానం సిడ్నీ నుంచి దుబాయ్ వెళ్లింది. ఈ విమానంలో జేమ్స్ అనే ప్రయాణీకుడి సీటు పక్కనే ఓ స్థూలకాయుడు కూర్చున్నాడు.
అతను తీవ్రంగా దగ్గుతూ పక్క సీటులోకి ఒరిగిపోతూ జేమ్స్కు తీవ్ర ఇబ్బందులు కలిగించాడు. దీంతో, తన సీటును మార్చాలని విమానయాన సిబ్బందిని జేమ్స్ అడిగాడు. దానికి వారు ససేమీరా అన్నారు.
సదరు స్థూలకాయుడి వల్ల ఇబ్బంది పడలేక, జేమ్స్ వేరే క్యాబిన్లోకి వెళ్లి కూర్చున్నాడు. అక్కడ కూర్చోకూడదని సిబ్బంది వారించింది. దుబాయ్ వరకు జేమ్స్ ఇబ్బంది పడూతూనే కూర్చొని ప్రయాణించాడు. దీంతో, అతనికి నడుం నొప్పి వచ్చింది.
ప్రయాణంలో తనకు ఇబ్బంది కలిగిందంటూ జేమ్స్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఈ కేసును కోర్టు విచారణకు స్వీకరించింది. కాగా, తమ పైన ఓ ప్రయాణీకుడు కేసు పెట్టడంతో దీని పైన పోరాటానికి ఎయిర్ లైన్స్ సంస్థ కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.