మహర్షుల నుంచి నేర్చుకోండి: శాస్త్రవేత్తలకి పారికర్
ఢిల్లీ: కోపం, అసూయ వంటి వాటిని జయించడం ఓ కళ అని, వీటితో పాటు వినయాన్ని కూడా శాస్త్రవేత్తలు మన మహర్షుల నుంచి నేర్చుకోవాలని బుధవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. మన దేశానికి చెందిన ప్రాచీన రుషులు బహుశా గొప్ప శాస్త్రవేత్తలన్నారు.
బుధవారం జరిగిన రక్షఖణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) సదస్సులో ఆయన శాస్త్రవేత్తల సదస్సులో మాట్లాడారు. నిగ్రహంతో అధికారం, విద్యతో వినయం పెరుగుతాయని తన నమ్మకం అని పారికర్ చెప్పారు.
ఆ కాలంలో మన రుషులు... కోపం, అహంకారం పైన పూర్తి నియంత్రణ కలిగి ఉండేవారు, శాస్త్రవేత్తలకు కూడా ఈ లక్షణం చాలా అవసరమని చెప్పారు. వినయాన్ని జీవితంలో ఓ భాగం చేసుకోవాలని శాస్త్రవేత్తలకు పారికర్ సూచించారు.
అణకువగా ఉండటాన్ని, అసూయ, ఆగ్రహాలను అధిగమించేందుకు రుషుల నుంచి ఎవరైనా నేర్చుకోవాలని అభిప్రాయపడ్డారు. దధీచి మహర్షి ఎముక నుంచి వజ్రాయుధం రూపొందించడాన్ని ఈ సందర్భంగా పారికర్ ఉదహరించారు.
రుషులు శాస్త్రవేత్తలా, ఆధ్యాత్మికవాదులా అనే వివాదంలోకి తాను వెళ్లదల్చుకోలేదని ఆయన చెప్పారు. నిగ్రహంతో శక్తి పెరుగుతుందని, వినయంతో విద్య పెరుగుతుందని తాను విశ్వసిస్తానని చెప్పారు. వ్యక్తిత్వం లేకుంటే విద్యకు విలువ లేదన్నారు. సైబర్, అంతరిక్ష పరిజ్ఞానంలో డిఆర్డీవో చేయాల్సింది చాలా ఉందని చెప్పారు.