గోపాల గోపాల సినిమాపై పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్: సినిమాలకు ఫిర్యాదుల బెడద తప్పడం లేదు. పవన్ కళ్యాణ్, వెంకటేష్ నటించిన మల్టీ స్టారర్ గోపాల గోపాల సినిమాపై ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రఘునాథరావు అనే వ్యక్తి ఆ సినిమాపై హైదరాబాదులోని సైఫాబాద్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా సినిమా ఉందంటూ ఆతను తన ఫిర్యాదులో అన్నాడు.
కాగా, గోపాల గోపాల సినిమా శనివారండు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాపై మంచి టాక్ కూడా వచ్చింది. హిందీలో ఓహ్, మై గాడ్ సినిమాకు ఇది రిమేక్. అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులను ఈ సినిమా విపరీతంగా ఆకర్షించింది. పవన్ కళ్యాణ్ సినిమాలకు ఈ మధ్య కాలంలో ఉన్న క్రేజ్ కూడా సినిమాకు అనుకూలంగా పనిచేసిందని అంటున్నారు.
సినిమా ముఖ్యంగా దొంగ స్వాములు, మూఢ నమ్మకాలపై ఎక్కుపెట్టిన ప్రశ్నలతో ప్రేక్షకులను ఆలోచనలో పడేసే దిశగా ప్రయత్నించారు. అయితే సామాన్య జనాలకు పెద్దగా పరిచయం లేని 'యాక్ట్ ఆఫ్ గాడ్' క్లాజ్ చుట్టూ కథ తిరగటం, సెకండాఫ్ లో ఎక్కువ భాగం కోర్టు సీన్స్, మెలోడ్రామా, మెసేజ్, తో నింపటం జరిగింది.
అలాగే ఎంటర్టైన్మెంట్ పాళ్లు కూడా చాలా చాలా తక్కువగా ఉన్నాయి. ఓ ప్రయోగంగా చూస్తే బాగుందనిపించే ఈ చిత్రం కమర్షియల్ గా భాక్సాఫీస్ వద్ద ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. అవన్నీ ప్రక్కన పెడితే పవన్ వంటి మాస్ ఇమేజ్ ఉన్న స్టార్ హీరో... వాటిని ప్రక్కన పెట్టి మెసేజ్ తో కూడిన చిత్రం కావడం విశేషం.