రాజయ్యకు మళ్లీ ప్రాధాన్యం: కెసిఆర్పై కడియం అలక
వరంగల్: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన అలక వహించారా? అంటే కావొచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తనకు మొదటి నుంచి ప్రత్యర్థి అయిన టి రాజయ్యకు మళ్లీ కెసిఆర్ ప్రాధాన్యం ఇస్తున్నారనే అభిప్రాయం కడియంలో ఉందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో ఆయన అలక వహించారనే వాదనలు వినిపిస్తున్నాయి. గురువారం నాడు జరిగిన టీఆర్ఎస్ఎల్పీ కీలక భేటీకి ఆయన డుమ్మా కొట్టారు. తన రాజకీయ ప్రత్యర్థి, తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం రాజయ్యకు మళ్లీ కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారని తెలుస్తోంది.
కడియం రాజీనామాతో ఖాళీ అయిన వరంగల్ లోకసభ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా రాజయ్య కుటుంబంలోని వ్యక్తిని బరిలోకి దింపాలని కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా రాజయ్య భార్య ఫాతిమా మేరీ గురించి కెసిఆర్ ఎంక్వయిరీ చేయించారంటున్నారు.
మొదటి నుంచి తనకు రాజకీయ ప్రత్యర్థిగా కొనసాగుతూ వస్తున్న టి రాజయ్య కుటుంబసభ్యులను తాను రాజీనామా చేసిన స్థానం నుంచి బరిలోకి దింపడం సరికాదని కడియం భావిస్తున్నారంటున్నారు. ఈ విషయంలో తన నిరసనను కేసీఆర్కు తెలిపేందుకు ఆయన భేటీకి డుమ్మా కొట్టి ఉంటారంటున్నారు.
అయితే, అదేం లేదని, జ్వరం రావడం వల్లే కడియం భేటీకి రాలేదని మరికొందరు చెబుతున్నారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి కొద్ది రోజుల్లోనే కడియంకు కెసిఆర్ ప్రాధాన్యత ఇచ్చారు. పార్టీలోకి వచ్చీరాగానే వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చారు.
ఏడాది తిరక్కముందే ఈ పదవికి రాజీనామా చేయించి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చారు. తన రాజకీయ ప్రత్యర్థి రాజయ్యను పక్కన బెట్టి మరీ... కడియం శ్రీహరికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం చర్చనీయాంశమైంది కూడా.