బాబుకి కోడలు బ్రాహ్మణి తలనొప్పి తెచ్చిపెట్టారా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కోడలు నారా బ్రాహ్మణి చిక్కులు కల్పించినట్లు చెబుతున్నారు. బ్రాహ్మణి చేసిన ఓ ప్రకటనతో ఆయన ఇరకాటంలో పడ్డారని అంటున్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2 వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల్లో ఓ 60 మందికి ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఉచితంగా శిక్షణ ఇస్తామని బ్రాహ్మణి ప్రకటించారు.
శిక్షణ పొందాలనుకున్నవారు బుధవారం లోగా ట్రస్టుకు దరఖాస్తు చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. దరఖాస్తు చేసుకున్నవారికి తెలంగాణలోని పలు జిల్లా కేంద్రాల్లో ప్రాథమిక స్థాయి పరీక్షలు నిర్వహించి ఎంపికైనవారికి శిక్షణ ఇస్తామని ఆమె చెప్పారు.
అయితే, ఇప్పటికిప్పుడు ఉద్యోగాలను భర్తీ చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధంగా లేదని అంటున్నారు. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ప్రస్తుతం 1.43 లక్షల ప్రభుత్వోద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఉద్యోగాల భర్తీకి చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ల ద్వారా పనులు కానిచ్సేస్తోంది.
బ్రాహ్మణి ప్రకటన వల్ల తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టినట్లు గుర్తు చేసినట్లవుతుందని, దానివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఉద్యోగాల భర్తీకి ఒత్తిడి పెరుగుతుందని భావిస్తున్నారట. ఎపిలోని ఖాళీలను భర్తీ చేయడం లేదని బ్రాహ్మణి ప్రకటన వల్ల ఎత్తిచూపినట్లవుతుందని ఓ ప్రముఖ మీడియా వార్తాకథనం వ్యాఖ్యానం.