నాతో సన్నిహితంగా లేకుంటే: అమ్మాయిలకి ప్రిన్సిపల్ హెచ్చరిక, చితక్కొట్టారు
బెంగళూరు: కర్నాటకలోని హుబ్బళ్లిలో ఓ కళాశాల ప్రిన్సిపల్ దారుణంగా ప్రవర్తించాడు. తనతో సన్నిహితంగా ఉండాలని, లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని విద్యార్థినీలను హెచ్చరించాడు. ఈ సంఘటన గురుపూజోత్సవం రోజు జరగడం గమనార్హం.
ఆ అమ్మాయిలు ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు ఆలస్యంగా చెప్పారు. దీంతో మంగళవారం ఉదయం తల్లిదండ్రులు కళాశాలపై దాడి చేసి ఆ మాస్టారుకు దేహశుద్ధి చేశారు.
కర్ణాటక రాష్ట్రం హుబ్బళ్లి నగరంలోని విద్యాగిరిలో ప్రముఖ విద్యా సంస్థకు చెందిన కళాశాల విద్యార్థులు ఈ నెల 4, 5 తేదీలలో పారిశ్రామిక అవగాహన పర్యటనలో భాగంగా గోవా వెళ్లారు. వారితో ప్రిన్సిపాల్ కూడా వెళ్లారు.
గోవాలో ఆనంద్ వడ్డిన్ మద్యం మత్తులో తనతో సన్నిహితంగా ఉండాలంటూ విద్యార్థినులను ఆహ్వానించాడు. లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించాడు.
అయితే, విద్యార్థినీలు అతడి బెదిరింపులకు లొంగలేదు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పర్యటనలో ఈ విషయాన్ని తల్లిదండ్రులకు వివరించారు. దీంతో మంగళవారం ఉదయం తల్లిదండ్రులు, ఇతర విద్యార్థులు కళాశాలకు చేరుకుని ప్రిన్సిపాల్కు దేహశుద్ధి చేశారు. కళాశాల ఫర్నిచర్ను ధ్వంసం చేశారు.