శకటాలలో 'బీజేపీ' రాజకీయం! మమతకు ఝలక్
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం నాడు భారతీయ జనతా పార్టీయేతర రాష్ట్ర ప్రభుత్వాల శకటాలు అంతగా కనిపించలేదనే వాదనలు వినిపిస్తున్నాయి! కేరళ, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, సహా పదమూడు రాష్ట్రాల ప్రభుత్వ శకటాలు దూరంగానే ఉన్నాయి. రాజస్థాన్, పంజాబ్ ప్రభుత్వాల వాహనాలు ప్రదర్శించకపోవడం గమనార్హం.
పెరేడ్లో కేవలం 16 రాష్ట్రాల శకటాలు ఉన్నాయి. అలాగే ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, హిమాచల్ ప్రదేశ్, దేశ రాజధాని ఢిల్లీ ప్రభుత్వాలు పరెడ్కు దూరంగా ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంత రాష్ట్ర ప్రభుత్వాల శకటాలు రాజ్పథ్ పరేడ్లో కనిపించలేదు.
66వ గణతంత్ర దినోత్సవ పెరేడ్లో 25 రంగురంగుల శకటాలు ప్రదర్శించారు. 16 రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ శాఖలు పాల్గొన్నాయి. ఆయా ప్రాంతాలు సంస్కృతి, సంప్రదాయాలు, సంక్షేమ పథకాలను వివరిస్తూ శకటాలను అలంకరించారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన కొత్తపథకాలు చోటుచేసుకున్నాయి.
కాగా, తమ శకటం లేకపోవడంపై పశ్చిమ బెంగాల్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహ రావు మాట్లాడుతూ.. గణతంత్ర దినోత్సవాలను రాజకీయం చేయడం బాధాకరమన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మక మేక్ ఇన్ ఇండియా, జన్ ధన్ యోజన, బేటీ బచావో బేడీ పఢావో, సేవ్ గంగా పథకాలు ప్రదర్శించారు. కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రదర్శించిన శకటాలు ఆకర్షణగా నిలిచాయి.