ప్రొ కబడ్డీలో వెంకయ్య: స్కూల్ జట్టుకు నేనే కెప్టెన్
హైదరాబాద్: ఇటీవల కాలంలో భారత్లో క్రికెట్ తర్వాత ప్రజాదరణ పొందుతున్న క్రీడల్లో కబడ్డీని ఒకటిగా చెప్పుకొవచ్చు. ప్రొ కబడ్డీ టోర్నమెంట్తో దేశ వ్యాప్తంగా వివిధ నగరాల్లో మ్యాచ్లను నిర్వహిస్తున్న నేపథ్యంలో రోజురోజుకీ కబడ్డీ ఆటను చూసేందుకు అటు సామాన్య ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు సైతన పెద్ద సంఖ్యలో స్టేడియాలకు వస్తున్నారు.
శుక్రవారం హైదరాబాద్లోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో తెలుగు టైటాన్స్, పుణేరి పల్టాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ను తిలకించేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
గ్రామీణ క్రీడ కబడ్డీకి గొప్ప ఆదరణ లభించడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని అన్నారు. పాఠశాల స్థాయిలో కబడ్డీతో పాటు ఖో-ఖో ఆడేవాడినని పేర్కొన్న వెంకయ్య, స్కూల్ కబడ్డీ జట్టుకు తానే కెప్టెన్ గా వ్యవహరించానని చెప్పారు. ప్రతీ స్కూల్లో కబడ్డీని తప్పనిసరి చేయాలని పేర్కొన్నారు.
రాజకీయాలకు కబడ్డీకి ఏమైనా దగ్గరి సంబంధం ఉందన్న ప్రశ్నకు గాను రాజకీయాల్లో రాణించాలంటే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని.. కబడ్డీకి కూడా అదే అవసరమని అన్నారు. అయితే కబడ్డీలో క్రమశిక్షణ ఉన్నదని, అది రాజకీయాల్లో కొరవడిందని చెప్పారు.