'ఈశ్వరుడు' అంటే ఎవరు: సహ కార్యకర్త ఝలక్
న్యూఢిల్లీ: 'ఈశ్వరుడు' అంటే ఎవరు అని చెప్పి సమాచార హక్కు చట్టం కింద ఓ వ్యక్తి అడిగి షాకిచ్చారు. చట్టసభల సభ్యులు తదితరులు ఈశ్వరుడి పేరిట ప్రమాణాలు చేస్తుంటారని, ఇంతకీ ఆయన ఎవరని సహ కార్యకర్త సదానంద్ యోగాచార్య ఆర్టీఐ చట్టం కింద అడిగారు.
అంతేకాగు, సత్యమేవ జయతేకు అర్థం ఏమిటని ప్రశ్నించారు. వాస్తవానికి, రాష్ట్రపతి సచివాలయాన్ని ఉద్దేశించి ఆయన ఈ ప్రశ్నలు అడిగారు. సచివాలయం దానిని హోంశాఖకు నివేదించింది. హోంశాఖ న్యాయశాఖకు పంపించింది. దీనిపై న్యాయశాఖ స్పందిస్తూ.. ఈశ్వరుడిని నిర్వహించే రాజ్యంగం ఏమీ లేదని చెప్పింది.
న్యాయశాఖ సమాధానంతో సదానంద యోగాచార్య సంతృప్తి చెందలేదు. తన అనుమానాన్ని కేంద్ర సమాచార సంఘానికి పంపించారు. దీనిపై సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి చిట్కారా స్పందించారు.
సత్యమేవ జయతే, సత్యం, మతం, కులం అనే వాటికి వేటికీ రాజ్యాంగంలో ఎక్కడా నిర్వచనాలు లేవని, కాబట్టి ఎలాంటి సమాచారం ఇవ్వలేమని చెప్పారు. సందర్భోచితంగా ఆ పదాలను అర్థం చేసుకునేందుకు దరఖాస్తుదారు ప్రయత్నించాలని సూచించారు.
ఆయా పదాలను మార్గదర్శకులే వివరించాల్సి ఉంటుందన్నారు. సహ చట్టం కింద అడగవద్దన్నారు. సమాచారం అనే మాటకు సహ చట్టంలో స్పష్టమైన నిర్వహచం ఉందన్నారు.
అయినప్పటికీ సదానంద్ యోగాచార్య సంతృప్తి చెందలేదు. దీంతో, సమాచార కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు.. ఈశ్వరుడు, సత్యం అనే మాటలకు మీరు నిర్వచనం చెప్పగలరా అని ఎదురు ప్రశ్నించారు. అనంతరం ఆయన ప్రశ్నను నిష్ప్రయోజమైనవిగా తిరస్కరించారు.