నా కేరెక్టర్ గురించి తప్పుగావద్దు: బాధపడ్డానన్న రోజా
హైదరాబాద్: సినిమా ఫీల్డ్ నుండి వచ్చిన తన కేరక్టర్ గురించి తప్పుగా మాట్లాడటం సరికాదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే రోజా ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. తమ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడేందుకే తాను ఇలా రెచ్చిపోయి మాట్లాడుతున్నట్లుగా చెబుతున్న దానిలో వాస్తవం లేదన్నారు. తనకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక లేదని, ఎమ్మెల్యే అవ్వాలనుకున్నాను.. అయ్యానని చెప్పారు.
రాజకీయాల్లో తనకు పెద్ద లక్ష్యాలు ఏమీ లేవని చెప్పారు. ఎమ్మెల్యే అవ్వాలనుకున్నానని, ఇదే విషయాన్ని చాలాసార్లు తాను చెప్పానని తెలిపారు. టీడీపీ నేతలు నా కన్నా నిన్నే ఎక్కువ టార్గెట్ చేస్తున్నారని తమ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ తనతో అన్నారన్నారు. తాను ఎప్పుడు ఇలాగే మాట్లాడుతానని, మహిళల కోసం ఎన్నోసార్లు రోడ్డెక్కానని ఆమె తెలిపారు.

తాను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని, కష్టపడ్డ తనకు టిక్కెట్ ఇవ్వకుండా టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనను పక్కన పెట్టిన సందర్భాలు ఉన్నాయని ఆరోపించారు. తనకు టీడీపీ నాయకులతోనే కాకుండా.. ఎవరితోను వ్యాపార సంబంధాలు లేవన్నారు. తన కేరక్టర్ గురించి టీడీపీ నేతలు తప్పుగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు.
తనతో ఉంటే తాను ఎంత మంచిదాన్నో అందరికీ తెలుస్తుందన్నారు. సభాపతిని ఫ్యాక్షనిస్ట్ అనడం కొత్తేం కాదన్నారు. ప్రతిపక్ష నాయకుడు ఎలా మాట్లాడాలో కూడా స్పీకర్ చెబితే ఎలా అని ప్రశ్నించారు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వనప్పుడు తాము సభలో ఉండటం ఎందుకన్నారు. ప్రభుత్వం తమ పైన వ్యక్తిగత దాడికి దిగుతోందన్నారు. అధికారంలో ఉన్నామని ఏమైనా మాట్లాడొచ్చని టీడీపీ అనుకుంటే సరికాదన్నారు.
తనను టీడీపీ నేతలు ఎప్పుడు టార్గెట్ చేస్తున్నారన్నారు. తనను ఐరన్ లెగ్ అనడం, ఓ సందర్భంలో తాను డిప్రెషన్కు లోనై కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పారు. తన వల్లనే ఇలా జరిగాయని, అలా జరిగాయంటూ ఐరన్ లెగ్ అనడం తనను బాధించిందన్నారు. తనను చంద్రబాబు పక్కన పెట్టడానికి కులమే అడ్డు వచ్చి ఉంటుందన్నారు. కాగా, రోజా పైన హైదరాబాదులోని సైఫాబాద్ పోలీసు స్టేషన్లో, నెల్లూరులోని ఓ పోలీసు స్టేషన్లో కేసులు పెట్టారు.












Click it and Unblock the Notifications