షాక్, సస్పెన్స్ థ్రిల్లర్: దొంగతనాలు చేస్తున్న ఆత్మ!!
హైదరాబాద్: హైదరాబాదుతో పాటు మరో మూడు జిల్లాల్లో జరుగుతున్న కొన్ని దోపిడిలకు చనిపోయిన వ్యక్తి కారణమట. సినిమా కథలా ఉన్నప్పటికీ.. ఇది నిజం! రికార్డుల ప్రకారం మృతి చెందిన ఓ దొపిడీ దొంగ వేలిముద్రలు తాజాగా దొంగతనాలు జరిగిన ప్రాంతంలో సేకరించిన వాటితో సరితూగుతున్నాయి.
సైబరాబాద్ పోలీసులు తాజాగా చేసిన దర్యాప్తులో ఈ వేలిముద్రలు పోలి ఉన్న వ్యక్తి మరణించాడనే ధ్రువీకరణ పత్రాన్ని సంపాదించడంతో అసలు కథ మొదలైంది. హైదరాబాద్, నిజామాబాద్, మహబూబ్నగర్, నల్గొండ జిల్లాలో జరిగిన పలు చోరీ కేసుల్లో మరణించిన వ్యక్తి వేలి ముద్రలను పోలి ఉన్నాయి.
దీంతో ఆ వ్యక్తి ఎవరై ఉంటారు? ఆ వ్యక్తి బతికే ఉన్నాడా? డెత్ సర్టిఫికెట్ నకిలీదై ఉంటుందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. రెండు నెలల క్రితం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏఆర్కే హోమ్స్ సమీపంలో అర్ధరాత్రి రెండు ఇళ్లల్లో దొంగతనం జరిగింది.

దుండగులు మెయిన్ డోర్ పక్కన ఉన్న కిటికీ గ్రిల్స్ను కట్ చేసి బంగారం, వెండి, నగదును ఎత్తుకెళ్లారు. ఇంట్లో ఉన్న కుక్కలకు మత్తు మందు ఇచ్చి దొంగతనం చేశారని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు... దర్యాప్తులో భాగంగా ఘటనాస్థలంలో వేలిముద్రలను సేకరించారు.
ఆ వేలిముద్రలు పోల్చి చూడగా... 1998లో నమోదైన దొంగతనం కేసులకు సంబంధించిన వ్యక్తి వేలిముద్రలతో పోలింది. అప్పుడు మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ దోపిడీ కేసులోని ప్రధాన నిందితుడు సంతోష్ కుమార్ వేలి ముద్రలతో సరిపోయాయి.
అప్పటి నుంచి అల్వాల్ క్రైం పోలీసులు సంతోష్ కుమార్ను పట్టుకోవడం కోసం గాలించారు. ఈ క్రమంలో 2007లో సంతోష్ కుమార్ మృతి చెందినట్టు షోలాపూర్ మున్సిపల్ శాఖ ఇచ్చిన డెత్ సర్టిఫికేట్ను అతని కుటుంబ సభ్యులు మాదాపూర్ పోలీసులకు సమర్పించినట్టు గుర్తించిన అధికారులు షాక్ తిన్నారు.
అల్వాల్తో పాటు నిజామాబాద్, మహబూబ్నగర్, నల్గొండ ప్రాంతాల్లో జరిగిన దొంగతనాలల్లో ఇలాంటి ఫింగర్ ప్రింట్స్ దొరికినట్లు తెలుసుకున్నారు. ఆ జిల్లాల పోలీసులు సంతోష్ కుమార్ కోసం గాలిస్తుండగా సైబరాబాద్ పోలీసులు మాత్రం అతని డెత్ సర్టిఫికెట్ విషయం వెలుగులోకి తెచ్చారు.
ఫింగర్ ప్రింట్స్ కరెక్ట్ అయితే డెత్ సర్టిఫికెట్ నకిలీదై ఉంటుందా? డెత్ సర్టిఫికెట్ కరక్టైతే ఫింగర్ ప్రింట్స్ అధికారుల నివేదిక తప్పు అయ్యి ఉంటుందా? అనే అనుమానాలు పోలీసులను వెంటాడుతున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ కథను తలపిస్తున్న ఈ ఎపిసోడ్లో సంతోష్ కుమార్ బతికి ఉంటాడనే అల్వాల్ క్రైం పోలీసులు ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు.
ఒకచోటకాకుండా మొత్తం మూడు జిల్లాల్లో సంతోష్ కుమార్ వేలిముద్రలు సరిపోతుండడంతో పోలీసుల నిఘా నుంచి తప్పించుకోవడానికి అతను చనిపోయినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications