వారి వల్లే ప్రమాదంలో హిందూమతం: బీజేపీ ఎంపీ
న్యూఢిల్లీ: హిందూ మతం ప్రమాదంలో పడిందని, అయితే ఈ ప్రమాదం సదరు హిందూమతాన్ని రక్షిస్తున్నామని చెబుకుంటున్న వారి వల్లే జరుగుతోందని బీజేపీ ఎంపీ, దళిత నేత ఉదిత్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడులోని ఓ దేవాలయంలో ప్రవేశం పైన నిషేధం విధించడంతో కొందరు దళితులు ఇస్లాం స్వీకరించేందుకు సిద్ధమయ్యారనే వార్తలు వస్తున్నాయి. వీటిపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దేశంలో తాము కూడా హిందువులమని చెప్పుకునేందుకు దళితులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. దళితుల ప్రవేశానికి ఆలయాల తలుపులు తెరుచుకోకపోతే వారు చర్చిలను, మసీదులను ఆశ్రయిస్తారని హెచ్చరికలు జారీ చేశారు.
సోకాల్డ్ రక్షణదారుల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన ఆరోపించారు. దళితులు మతం మారడం వల్ల హిందూ మతానికి ప్రమాదం లేదని, మతాన్ని రక్షిస్తున్నామని చెప్పుకుంటున్న సోకాల్డ్ రక్షణదారుల వల్లే మతానికి అతిపెద్ద ప్రమాదం పొంచి ఉందన్నారు.
తమిళ నెల ఆది సందర్భంగా నాగపట్టణంలోని భద్రాకాళియమ్మాన్ ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన దళితులను అగ్రవర్ణాలకు చెందిన కొందరు అడ్డుకున్నారు. దీంతో దళితులందరూ మూకుమ్మడిగా ఇస్లాంలో చేరాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ వార్తలను నాగపట్టణం జిల్లా అధికారులు కొట్టిపారేశారు. కాంబోడియాలో అతిపెద్ద హిందూ దేవాలయం ఉందని, కానీ అక్కడ ఒక్క హిందువు లేడన్నారు.