కడియం, కొండా, ఎర్రబెల్లి: వరంగల్లో ఒకే ఒర, 3కత్తులు
హైదరాబాద్: నిన్నమొన్నటి వరకు కత్తులు దూసుకున్న నేతలు ఇప్పుడు ఒకే పార్టీలో చేరిపోయారు. దీంతో ఇది ఆసక్తికరంగా మారింది. వరంగల్ జిల్లాకు చెందిన కడియం శ్రీహరి, కొండా సురేఖ, ఎర్రబెల్లి దయాకర రావులు ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో ఉంటున్నారు.
మొదట కాంగ్రెస్, ఆ తర్వాత వైసిపిలో ఉన్న కొండా సురేఖ సార్వత్రిక ఎన్నికలకు ముందే తెరాసలో చేరారు. టిడిపి ముఖ్యనేతగా ఉన్న కడియం శ్రీహరి కూడా ఎన్నికలకు ముందే కారు ఎక్కారు. కడియం ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. తాజాగా ఎర్రబెల్లి దయాకర రావు తెరాసలో చేరారు.
కడియం, ఎర్రబెల్లిలు టిడిపిలో ఉన్నప్పుడు జిల్లాలో ఆధిపత్యం కోసం చూసేవాళ్లు. కొండా సురేఖ కాంగ్రెస్, వైసీపీలో ఉన్నప్పుడు రాజకీయ వైరం ఉంది. ఇప్పుడు వీరు ముగ్గురు ఒకే పార్టీలో ఉండటంతో వరంగల్ జిల్లాలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
గతంలో టిడిపిలో ఎర్రబెల్లి, కొండా సురేఖ భర్త కొండా మురళీ సహచరులుగా ఉన్నారు. ఆ తర్వాత రాజకీయ ప్రత్యర్థులుగా మారారు. ఈ ఇద్దరి నేతల కోసం వారి అనుచరులు కొంతమంది చనిపోయినట్లుగా కూడా చెప్పుకుంటారు. ఇరువురు కూడా భద్రతను ఏర్పాటు చేసుకున్నారు.
ఎర్రబెల్లి అనుచరుడు ప్రతాప్ రెడ్డి హత్య కేసులో కొండా మురళి జైలుకు వెళ్లారు. ఇప్పుడు కొండా దంపతులు, ఎర్రబెల్లిలు ఒకే పార్టీలో చేరడంతో ఆసక్తికరంగా మారింది. మరోవైపు కడియం, ఎర్రబెల్లిలు టిడిపిలో ఉన్నప్పుడే ఆధిపత్యం కోసం ప్రయత్నించేవారు.
జిల్లాలో ఆధిపత్యం కోసం.. వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపించేది. వీరి మధ్య విభేదాలు పరిష్కరించేందుకు కొన్ని సందర్భాల్లో అప్పుడు చంద్రబాబు జోక్యం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇటీవలే కాట్రపల్లిలో జరిగిన బహిరంగ సభలో కడియం, ఎర్రబెల్లిల మధ్య వాగ్యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరు తెరాసలో ఉన్నారు. దీంతో వీరి మధ్య సంబంధాల విషయంలోను ఆసక్తిగా మారింది.