అవార్డ్ వాపసీ: ఇప్పుడు రైతుల వంతు, అందుకే
మంబై: దేశంలో అసహనం ఉందంటూ ఇటీవలి వరకు కొందరు కళాకారులు, రచయితలు తమ అవార్డులు వెనక్కి ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, మహారాష్ట్రలో రైతులు తమ అవార్డులను వెనక్కి ఇస్తున్నారు. రైతులు అవార్డులు వెనక్కి ఇస్తోంది.. అసహనం పైన కాదు.
కరువు పీడిత ప్రాంతాల్లో తమను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలసత్వం చూపిస్తోందని, ఈ అలసత్వానికి నిరసనగా తమ అవార్డులను వెనక్కి ఇస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే ఈ అవార్డు వాపసీ ఉద్యమానికి పూనుకున్నామని చెబుతున్నారు.
సాగులో చూపించిన ప్రతిభకు గాను 1983లో రాష్ట్ర ప్రభుత్వం చేత ఉత్తమ రైతు పురస్కారాన్ని అందుకున్న జల్నా ప్రాంతానికి చెందిన నారాయణ ఖడ్కే అనే రైతు ఇటీవల తన అవార్డును వెనక్కి ఇచ్చారు. లాతూర్ జిల్లాలోని కర్ల గ్రామానికి చెందిన మరో రైతు విఠల్ రావ్ కాలే కూడా అవార్డును వెనక్కి ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వ రైతు సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టినప్పటికీ అమలులో మాత్రం చిత్తశుద్ధిని చూపించడం లేదని నారాయణ ఖడ్కే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విఠల్ రావ్కు 2001లో అవార్డు వచ్చింది. అతను తన అవార్డుతో పాటు తనకు వచ్చిన రూ.10వేల నగదు బహుమతిని కూడా సీఎం సహాయ నిధికి తిరిగి ఇచ్చేశారు.