అందచందాలు, తియ్యని మాటలు: ఈ మాయలేడీపై 200కుపై కేసులు
బెంగళూరు: ఆమె అందంగా ఉంటుంది. మాటలతో మాయ చేస్తోంది. ఆమె బుట్టలో పడ్డారా? మోసపోయినట్లే. ఇలా ఆమె తన అందచందాలను, తియని మాటలనే ఆయుధాలుగా చేసుకుని అనేక మోసాలకు పాల్పడి లక్షలు కాజేసింది. దీంతో ఆమె బాధితులు పెట్టిన కేసులు 200లకు మించిపోవడం గమనార్హం. ఆమే 26ఏళ్ల ఖుష్బూ శర్మ అలియాస్ స్మృతి శర్మ.
రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఆమె మోసాలకు పాల్పడింది. కాగా, ఆమే పాపం పండి లేడీ డాన్, లేడీ కొకోవాగా పలు పేర్లతో చెలామణి అవుతునన ఖుష్బూ శర్మను బెంగళూరు పులకేశినగర ఠాణా పోలీసులు శనివారం అరెస్టు చేశారు. న్యాయమూర్తి ముందు ఆమెను హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఆమెను తమ అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టాలని ఆయా రాష్ట్రాల్లోని పోలీసులు ఇప్పటికే బెంగళూరు నగర పోలీసులను సంప్రదించారు.
ఆమె మోసాల చిట్టా పూర్వాపరాలను గమనించినట్లయితే.. రాజస్థాన్కు చెందిన ఖుష్బూ చదివింది ఎనిమిదో తరగతే. ఆమె 12 సంవత్సరాల వయసులో జరిగిన రహదారి ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయింది. తన కుడిచేతిని కూడా పోగొట్టుకుంది. కృత్రిమ చేతిని అమర్చుకుని, తనకు చెయ్యి లేదన్న విషయాన్ని ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడేది. కొద్ది రోజులు బంధువుల నివాసం, అనంతరం అనాథాశ్రమంలో ఉంది. యుక్తవయసు వచ్చేసరికి బయటి ప్రపంచంలో అడుగుపెట్టింది.

అప్పటి నుంచి సంపన్న యువకులను లక్ష్యంగా చేసుకుని పలు రాష్ట్రాల్లో వంచనకు పాల్పడి తప్పించుకుంటూ వస్తోంది. ఇప్పటి వరకు వేర్వేరు ప్రాంతాల్లో 20 సార్లు పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అయితే తాను అమాయకురాలినంటూ స్టేషన్ బెయిల్పై, న్యాయస్థానం నుంచి జామీను తీసుకుని తప్పించుకుంటూ వచ్చింది. తాను ఐఏఎస్ అధికారినని, సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయవాదినని పరిచయం చేసుకుని పలువురిని వంచించింది.
తన తండ్రి ఐపీఎస్ అధికారిగా చెప్పేది. అంతేగాక, ఫేస్బుక్లో పలు పోస్టులు కూడా చేసేది. ఆమెకు కార్లు నడపటం అంటే అమితాసక్తి. దొంగిలించిన కార్లను పెట్రోలు బంకులకు తీసుకెళ్లి ట్యాంకు నిండుగా ఇంధనాన్ని నింపేది. ఐఏఎస్ అధికారినని, తనను డబ్బు అడగకూడదని హెచ్చరించేది. డబ్బు అడిగితే మీ బంకు లైసెన్సు రద్దు చేయిస్తానని హెచ్చరించి వెళ్లిపోయేది. ఇంధనం ఖాళీ అయ్యేంత వరకు తిరిగేది. ఆ తర్వాత కారును రహదారిపై విడిచి వెళ్లిపోయేది.
ఆమె జల్లాలు అన్నీఇన్నీ కావు..
పబ్లు, డిస్కోథెక్ల వద్దకు చక్కగా అలంకరించుకుని వెళ్లేది. సాధారణంగా డిస్కోథెక్లు, పబ్లలోకి కొన్ని నిర్ణీత సమయాల్లో జంటలను మాత్రమే అనుమతిస్తారు. ఒంటరిగా వచ్చిన వారిని వెనక్కి పంపిస్తారు. అలా ఒంటరిగా ఉన్న వారికి ఖుష్బూ గాలం వేసేది. వారితో పబ్, డిస్కోథెక్లకు వెళ్లేది. వారితో కలిసి మద్యం తాగేది. వారి నుంచి నగదు, విలువైన వస్తువులను కొట్టేసి చక్కగా జారుకునేది.
అంతేగాక, రహదారిపై ఒంటరిగా నిల్చుని ఖరీదైన కార్లలో వచ్చే వారిని లిఫ్ట్ కోరేది. కారులోకి ఎక్కిన తరువాత ఒయ్యారాలు పోతూ యువకుల్ని పరిచయం చేసుకునేది. 'నీతో రాత్రంతా గడిపేందుకు సిద్ధం'అంటూ వారిని కవ్వించేది. గర్భనిరోధక సాధనాలను కొనుగోలు చేసుకు రమ్మని వారిని పంపించేది. తర్వాత ఆ కారుతో చెక్కేసేది.
తనకు స్థలం, ఇల్లు, ఫ్లాట్ ఉన్నాయంటూ సంపన్నులను సంప్రదించేది. మార్కెట్ ధరలో సగాన్ని ఇస్తే సరిపోతుందని ప్రతిపాదించేది. తాను అప్పుల్లో ఉన్నానని, సమస్య నుంచి బయట పడేందుకు నగదు అవసరమని చెప్పేది. ముందుగా తయారు చేసుకున్న నకిలీ దస్తావేజులను వారికిచ్చేది. అత్యవసరంగా రూ.లక్ష లేదా రూ.రెండు లక్షలివ్వమని కోరేది. ఇంకేముంది ఇచ్చిన నగదు తీసుకుని మాయమైపోయేది.
అంతేగాక, ఫేస్బుక్ సంపన్నులకు వల వేసి వారి వద్ద నుంచి లక్షలు కాజేసింది. ఆమెతో ఏకాంతంగా ఉన్న ఫొటోలను నెట్లో పెడతానని బెదిరింపులకు గురిచేసి డబ్బులు గుంజేది. కాగా, బెంగళూరుకు గత జూన్లో వచ్చిన ఖుష్బూ, ఇందిరానగరలో ఒక పేయింగ్ గెస్ట్లో గదిని అద్దెకు తీసుకుని ఉంటోంది. ఎక్కువ మొత్తంలో నగదు సంపాదించాలన్న ఆలోచనతో నగరానికి వచ్చిన ఆమె ఒక ప్రముఖ న్యాయవాది వద్దకు వెళ్లి, తానూ న్యాయవాదినే అంటూ జూనియర్గా అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఆమె మాటలు విశ్వసించేలా చేసింది.
ఆ న్యాయవాది కొత్త కార్యాలయం ఏర్పాటుకు చూస్తున్నారని తెలుసుకుని తనకు యుబి సిటీలో 17, 18వ అంతస్తుల్లో ఫ్లాట్లు ఉన్నాయని నమ్మించింది. త్వరలో అక్కడకు తీసుకు వెళ్లి చూపిస్తానని, దానిలో అద్దెకు ఉన్న వారిని ఖాళీ చేయించి, మీకు విక్రయిస్తానంటూ తెలిపింది. న్యాయవాదికి సన్నిహితంగా మారిన ఆమె అక్టోబర్ నెలాఖరున అతని నల్ల గౌను, రూ.2.25 లక్షల నగదు, ఆయన నివాసంలోని ఆభరణాలను దొంగిలించింది. వెంటనే తాను ఉంటున్న పేయింగ్ గెస్ట్ గదిని ఖాళీ చేసింది. దొంగిలించిన ఒక కారులో నగరంలోని పలు ప్రాంతాల్లో తిరిగింది.
మోసపోయానని తెలుసుకున్న ఆ న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తన కోసం గాలిస్తున్నారని తెలుసుకుని చిత్తూరు మార్గంలో తిరుపతికి వెళ్లాలని ఆమె నిర్ణయించుకుంది. అయితే అక్కడకు కూడా పోలీసులు వచ్చి తనను అరెస్టు చేస్తారని భయపడింది. దీంతో న్యాయవాదికే నవంబర్ 3న రాత్రి ఫోన్ చేసి 'నేను తప్పు చేశాను. మీ వద్ద దొంగిలించినవన్నీ వెనక్కు ఇచ్చేస్తాను. నా పరువు తీయవద్దు. కేసు వెనక్కు తీసుకోవాలని' విజ్ఞప్తి చేసింది. సరే రమ్మని ఆమెకు అభయమిచ్చిన న్యాయవాది ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.
అప్రమత్తమైన పోలీసులు.. న్యాయవాది కార్యాలయానికి వచ్చిన ఖుష్బూను అరెస్టు చేశారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేసేందుకు న్యాయస్థానంలో అర్జీ వేస్తున్నట్లు అదనపు పోలీసు కమిషనర్ హరిశేఖరన్ తెలిపారు. ఆమె ఒక్కో సందర్భానికి ఒక్కో సిమ్ కార్డును వినియోగించడంతో సులువుగా తమ నుంచి తప్పించుకునేదని ఆయన వివరించారు. ఆమె బాధితుల సంఖ్య భారీగానే ఉందని, పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications