ముకేష్ అంబానీకీ తప్పని ర్యాగింగ్: చేసిందెవరంటే..?
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేష్ అంబానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్గత అనుసంధానత విషయంలో ఇతర టెలికాం ఆపరేటర్లు కొత్తగా వచ్చిన తమ(జియో)ను ర్యాగింగ్ చేస్తున్నారని ముకేష్ అంబానీ పేర్కొన్నారు. ఒక తెలివైన విద్యార్థికి ఎదురయ్యే ర్యాగింగ్ వంటిదే సంస్థా పరంగా తామూ ఎదుర్కొంటున్నామని తెలిపారు.
'అవును.. మాకూ సమస్యలున్నాయి. ఒక తెలివైన విద్యార్థికి ప్రతిష్ఠాత్మక సంస్థలో చేరితే.. కేవలం అతని తెలివితేటలకు ఓర్వలేక హాస్టల్లోని విద్యార్థులు ర్యాగింగ్ చేసినట్లు, అత్యాధునిక సాంకేతికత, విస్తారమైన నెట్వర్క్తో వస్తున్న మా సంస్థ కూ అదే తరహా సమస్యలు ఎదురవుతున్నాయి' అని ముకేష్ అంబానీ వివరించారు.
ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ముకేష్ అంబానీ మాట్లాడారు. 'నేను, నా కంపెనీ ఆ వేధింపులు భరిస్తాం కానీ.. లక్షల కొద్దీ వినియోగదార్ల విషయంలో దాన్ని మేం సహించబోము' అని ముకేష్ స్పష్టం చేశారు. త్వరలోనే 'వారు' ఈ 'ర్యాగింగ్' ఆపుతారనే తాము భావిస్తున్నట్లు తెలిసారు.
'మా కొత్త కంపెనీ జియోపై ఇప్పటిదాకా రూ.1,50,000 కోట్ల పెట్టుబడులు పెట్టాం. 4జీ సేవలను దేశం అంతటా అందించడం కోసం రెండో దఫా పనులకు కలిపి మొత్తం రూ.2,50,000 కోట్లు పెట్టుబడులుగా పెడుతున్నాం. ప్రపంచం ఇపుడు ఆలోచనల గని కిందకు మారింది. ఆర్థిక వనరులనేవి ఇపుడు సమస్యే కాదు' అని దేశంలోనే అత్యంత సంపన్నుడైన అంబానీ వివరించారు.
జియో మనుగడ, లాభదాయకతపై కొంత మంది ఆర్థిక విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, వారి ఆలోచనలు సరి కాదని తేల్చి చెప్పారు. ఎంతో విశ్లేషణ జరిపిన తర్వాతే జీయోను తీసుకొచ్చినట్లు వివరించారు. అత్యుత్తమంగా తీర్చిదిద్దిన వ్యాపారమని, దీన్ని టెక్నాలజీ కంపెనీల వ్యవహారశైలిని సాధారణంగానే ఆర్థిక మార్కెట్లు సరిగా అర్థం చేసుకోలేవని అన్నారు. యాపిల్, గూగుల్ల విషయంలోనూ అదే జరిగిందని అన్నారు. ఆర్థిక విశ్లేషకులు తప్పు అని తాము నినిరూపిస్తామని చెప్పుకొచ్చారు.
'2010లో మా అమ్మాయి ఇషా 'ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉంది నాన్నా' అని చెప్పింది. అప్పుడే దేశ యువత ఆకాంక్షలకు అనువైన సంస్థ ఏర్పాటు చేయాలని ఆలోచించా. అది సాకారం అయ్యేందుకు యువ సారధులు ఎంతో శ్రమించారు' అని ముకేశ్ అంబానీ వివరించారు.
అంతేగాక, 'మేం వెలువరిచే ఒక్కో త్రైమాసిక ఫలితాలనూ చూస్తూ ఉండండి. అపుడు మీకే అర్థమవుతుంది. 12 ప్రాంతీయ భాషల్లో అత్యుతన్న నాణ్యతతో డేటా అనుబంధ సేవలు అందించడానికి జియో తీవ్రంగా పరిశ్రమిస్తోంది. 2018-19 కల్లా స్థానిక కంటెంట్ను తీసుకువస్తాం' అని స్పష్టం చేశారు. అంటే ముకేష్ అంబానీ.. జీయో విషయంలో ఎంత ఆత్మ విశ్వాసంతో ఉన్నారో అర్థమవుతోంది.