చివరితేదీ తర్వాత: పాత నోట్లుంటే రూ.50వేల నుంచి భారీ జరిమానా?
న్యూఢిల్లీ: రద్దయిన పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునేందుకు డిసెంబర్ 30 వరకు కేంద్ర ప్రభుత్వం గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈలోపే పాత పెద్ద నోట్లను బ్యాంకుల్లో జమ చేసుకోవాలి.. లేదంటూ ఇబ్బందులు తప్పేలా లేవు. ఎందుకంటే.. చివరి తేదీ ముగిసిన తర్వాత మీ దగ్గర పదికి మించిన పెద్ద నోట్లు ఏవైనా ఉంటే వాటి విలువకు ఐదింతలు లేదా రూ.50వేలు.. ఈ రెంటిలో ఏది ఎక్కువ అయితే దానిని జరిమానాగా విధించేందుకు కసరత్తులు జరుగుతున్నాయి.
ఈ మేరకు ఒక ఆర్డినెన్స్ తెచ్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నదని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. బుధవారం జరిగే కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. డిసెంబర్ 30తో పెద్ద నోట్ల డిపాజిట్కు గడువు ముగిసిపోయినా.. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద వచ్చే ఏడాది మార్చి 31 వరకు జమచేసేందుకు అవకాశం ఉంది.
ఇలాంటి కేసులలో ఎలా వ్యవహరిస్తారన్న విషయంలో స్పష్టత లేదు. అయితే ఆ గడువును కూడా కుదిస్తారనే అభిప్రాయం అధికారవర్గాల్లో వినిపిస్తోంది. ఏదైనా నోటుపై ముద్రించిన మొత్తానికి కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ హామీ ఇస్తాయి.
ఇప్పుడు రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన దరిమిలా.. సదరు హామీకి చెల్లుచీటి ఇవ్వాల్సిన అవసరం చట్టరీత్యా ఉంది. దీంతో ఈ మేరకు కూడా ఆర్డినెన్స్లో పొందుపరుస్తారని సమాచారం. గతంలో 1978లో రూ.1000, రూ.5000, రూ.10000 నోట్లను మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా పార్టీ ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత ఆ నోట్లపై ఇక తమ బాధ్యత లేదంటూ ఒక ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఇప్పుడు కూడా లాగే జరగనుంది.