షాక్: గ్రామస్తులను పెళ్లాడిన నటి దీపిక, సోనాక్షి!
లక్నో: పేదలకు చౌక ధరల్లో ఆహార పదార్థాలను అందించే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ప్రజా పంపిణీ వ్యవస్థకు కొందరు కిలాడీలు వినూత్న రీతిలో మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో ప్రభుత్వం ఖజానాకు భారీ స్థాయిలో నష్టం జరుగుతోంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల వెలుగుచూసిన ఈ దందాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఉత్తరప్రదేశ్లోని చందౌలి జిల్లా మీరాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని సాహెబ్గంజ్లో ఓ రేషన్ డీలర్ బాలీవుడ్ నటీమణుల పేరుతో కార్డులు సంపాదించి రేషన్ సరుకులు పొందుతున్నాడు.
బాలీవుడ్ తారలు దీపిక పదుకొనే, సోనాక్షి సిన్హా, జాక్విలిన్ ఫెర్నాండెజ్, రాణిముఖర్జీ, తదితరుల పేర్లతో రేషన్ కార్డులు మంజూరయ్యాయి. ఈ తారలందరూ ఇక్కడి గ్రామస్తులను వివాహం చేసుకున్నాడని ఆ రేషన్ డీలర్ పేర్కొన్నాడు. అంతేగాక, వారి ఆదాయం ఏడాదికి రూ. 11వేలేనని పొందుపర్చాడు.
రేషన్ డీలర్లు ఈ విధంగా అక్రమంగా కార్డులు పొంది సరుకులు పక్కదారి పట్టిస్తున్నారని గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబందిత అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.